చిరు సపోర్ట్: కిరణ్ బలం పెరుగుతోందా, ఢిల్లీ టెన్షన్!
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. విభజన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మద్దతు పలుకుతున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. విభజన విషయంలో కిరణ్ను సమర్థిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర సమైక్యతకు కట్టుబడిన కిరణ్ను అధిష్ఠానం మార్చాలని చూస్తే సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వెంటే నిలుస్తామని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ ఆదివారం వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు మంత్రులు అధిష్ఠానం నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించవచ్చని కానీ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా సమైక్యతకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.

లగడపాటి, చిరంజీవి, పితాని... ఇలా కిరణ్కు పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మద్దతు పలుకుతున్నారు. దీంతో అధిష్టానానికి విభజన మరింత తలనొప్పిగా మారిందంటున్నారు. ఇప్పటికే కిరణ్ను మార్చాలా? లేక రాష్టప్రతి పాలన విధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలా? అనే దిశగా పార్టీ అధిష్ఠానం తర్జన భర్జన పడుతోంది.
కిరణ్కు నేతల నుండి మద్దతు లభిస్తున్న నేపథ్యంలో మారిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? కిరణ్ కొత్త పార్టీని స్థాపిస్తారా? ఆయనతో పాటు ఎంతమంది ప్రజాప్రతినిధులు బయటకు వెళ్తారు? కొత్తగా ముఖ్యమంత్రి ఎంపిక చేయడం సులభమేనా? ముఖ్యమంత్రి ఎంపిక కోసం సిఎల్పీలో ఏకవాక్య తీర్మానం సాధ్యమా? అప్పుడు ఏర్పడే సంక్లిష్ట పరిస్థితులు చక్కదిద్దడం సాధ్యమవుతుందా? చివరకు రాష్టప్రతి పాలన దిశగా అడుగులు వేయాల్సి వస్తుందా? అని అధిష్ఠానం తర్జన భర్జన పడుతోంది.
ఈ మేరకు రాష్ట్ర పార్టీపై, పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్రం తాజాగా ఇంటెలిజెన్స్ నివేదిక కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. కిరణ్ అధిష్టానాన్ని బహిరంగా వ్యతిరేకిస్తుండటంతో మిగిలిన నేతలకూ బలం చేకూరుతోందంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు సీమాంధ్ర నేతలు అధిష్ఠానాన్ని తప్పుపడుతూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో సీమాంధ్రలో పార్టీ అదుపు తప్పుతోందా? అనే అనుమానాలు హైకమాండ్ పెద్దలకు కలుగుతోంది.
ముఖ్యమంత్రిగా తాను ఉన్నంత వరకూ విభజన జరగదని కిరణ్ ఇప్పటికే సీమాంధ్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇస్తున్నారు. తాజాగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖలు రాసి సంచలనం సృష్టించారు. కిరణ్ను లగడపాటి, ఇతర నేతలు సమర్థించడాన్ని పక్కన పెడితే చిరంజీవి సమర్థించడం మరో పరిణామం. అయితే అదే సమయంలో విభజన జరిగితే న్యాయం చేయాలని కూడా వ్యాఖ్యానించారు. లగడపాటి, జెసి దివాకర్ రెడ్డి, పితాని వంటి నేతలు ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడటంపై అధిష్టానం ఆందోళన చెందుతోందంటున్నారు.












Click it and Unblock the Notifications