లగడపాటి కోసం కన్నీళ్లు: కాంగ్రెస్ తప్పుకాదు కానీ
రాజకీయాల్లో కొనసాగాలని విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ను కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పలువురు పట్టుబట్టారు. శనివారం లగడపాటి విభజన తర్వాత విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా తనను ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అదే సమయంలో పలువురు కార్యకర్తలు స్వాగతం పలికారు. విలేకరులతో మాట్లాడుతుండగా... రాజకీయాల్లో కొనసాగాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరోవైపు లగడపాటి మాట్లాడుతూ... ఇది విధి చేసిన విభజన అని, దీన్ని ఆపేందుకు శాయశక్తులా కృషి చేశానని, కానీ విఫలమయ్యానని చెప్పారు. విభజన విషయంలో కాంగ్రెస్ తప్పు చేయలేదని, అందులోని వ్యక్తులే తప్పు చేశారని, దీనికి చాలా బాధపడుతున్నానన్నారు. భావోద్వేగాలను అసరా చేసుకుని రాజకీయాలను నడపడం తనకు ఇష్టం లేదని.. దీంతో రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

ఇక, తొలుత తన చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఈ మాటలతో కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ లగడపాటి రాజకీయాలలో కొనసాగాలని, సీమాంధ్ర రాజధానిని అభివృద్ధి చేయాలని నినాదాలు చేశారు. మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటే తమకు దిక్కెవరంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు. రాజకీయాలలో కొనసాగుతున్నట్లుగా మీడియా సాక్షిగా ప్రకటించాలంటూ లగడపాటిపై ఒత్తిడి తెచ్చారు.
మహిళా కార్యకర్తలు కూడా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యకర్తలను సముదాయించేందుకు లగడపాటి ప్రయత్నించినా వారు వినలేదు. చివరికి లగడపాటి తన ఆమోదాన్ని ప్రకటిస్తున్నట్లుగా కార్యకర్తలే ఆయన చేతులు రెంటినీ బలవంతంగా పైకెత్తి హర్షధ్వానాలు చేశారు. కొందరు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాజకీయాల్లో కొనసాగాలని ఆందోళన చేశారు. అయితే, లగడపాటి మాత్రం తన నిర్ణయం మారదని చెప్పారు.












Click it and Unblock the Notifications