రాజకీయ సన్యాసం: లగడపాటి ఏం చేస్తున్నారు?
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవద్దని లగడపాటికి ఎంతో మంది రాజకీయ ప్రముఖులు సూచించినప్పటికీ ఆయన తన మాటను వెనక్కితీసుకునేందుకు నిరాకరించారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీకి ఆయన సలహాదారుగా సహకరించారు. కానీ, ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల జోలికి అసలు రావడం లేదు. దీంతో ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఉద్యమ కాలంలో లడపాటి రాజగోపాల్ పేరు లేకుండా రాజకీయాలు సాగలేదు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే సంఘటన ద్వారా లగడపాటి రాజగోపాల్ పేరు దేశరాజకీయాల్లో కూడా మారు మ్రోగింది.
ప్రస్తుతం రాజగోపాల్ పూర్తిగా తన శక్తియుక్తులను వ్యాపారానికి వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ల్యాంకో ప్రధాన కార్యాలయం ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ నగరంలో ఉంది. లగడపాటి రాజగోపాల్ అక్కడే నివాసం ఉంటూ ల్యాంకో కార్యకలాపాలను చూసుకుంటున్నారు. వారంలో నాలుగు రోజులు గుర్గావ్లో ఉంటూ వారాంతానికి హైదరాబాద్ చేరుకుంటున్నారు.
స్నేహితులు, మిత్రుల ఇళ్లలో జరిగే ఫంక్షన్స్కు ఆయన తప్పకుండా హాజరవుతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్న ల్యాంకో భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు కూడా లగడపాటి రాజగోపాల్ పెద్దగా బాధపడలేదని అంటున్నారు.
అయితే, ల్యాంకో భూములను తాము చట్టబద్దంగా కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి ప్రభుత్వం నిర్వహించిన వేలంలో కొనుకున్నామని నిరూపించే డాక్యుమెంట్స్ను లగడపాటి టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.