సన్ కంట్రోల్: యనమలకు నారా లోకేష్ షాక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ క్రమంగా అధికారం చూపిస్తున్నారు. నారా లోకేష్ సూచనతో చంద్రబాబు నాయుడు కొందరు మంత్రుల ప్రైవేట్ కార్యదర్శులను మార్చేశారు. కొంత మంది మంత్రులు గత కాంగ్రెసు ప్రభుత్వంలో పనిచేసిన వారిని వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకున్నారు. దీన్ని నారా లోకేష్ వ్యతిరేకించారు. దీంతో వారిని చంద్రబాబు మార్చేశారు.
నారా లోకేష్ చేయి చేసుకోవడంతో ఏడుగురు మంత్రులు తమ వ్యక్తిగత కార్యదర్శులను మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓస్డీగా ఎన్విఎస్ఎస్ శ్రీనివాస్ను డ్రాప్ చేసుకుని జి. లక్ష్మీప్రసాద్ను నియమించుకోవాల్సి వచ్చింది. కాంగ్రెసు ప్రభుత్వంలో శ్రీనివాస్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి వద్ద ఓస్డీగా పనిచేయడంతో యనమల రామకృష్ణుడు ఆయనను నియమించుకోవడాన్ని నారా లోకేష్ వ్యతిరేకించారు. శ్రీనివాస్ను తప్పించకుండా ఉండడానికి యనమల తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది.
అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన వ్యక్తిగత కార్యదర్శి ఎం. సుబ్బరాజును సరెండర్ చేయాల్సి వచ్చింది. రాజు మాజీ కార్మిక మంత్రి దానం నాగేందర్ వద్ద పనిచేశారు. ఎస్. సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి తోట నర్సింహం వద్ద పనిచేశారు. దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యల రావు తన వద్ద నియమించుకున్నారు. అయితే, ఆయనను మాణిక్యాల రావు వదులుకోక తప్పడం లేదు.

రోడ్లు భవనాల మంత్రి సిద్ధ రాఘరావు నియమించుకన్న కాశీనాథ్, కెఇ కృష్ణమూర్తి తన ఓఎస్డీగా నియమించుకున్న ఎం. గోపాలం కూడా మారిపోయారు. గోపాలం ఇంతకు ముందు బొత్స సత్యనారాయణ వద్ద పనిచేశారు. యనమల రామకృష్ణుడు కొత్తగా నియమించుకున్న వ్యక్తగత కార్యదర్శికి మాత్రమే నారా లోకేష్ పచ్చజెండా ఊపారు.
మిగతా మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు నారా లోకేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇంతకు ముందు మంత్రులు తమకు ఇష్టమైనవారిని వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకునేవారు. కొత్తగా మంత్రులు తమ వ్యక్తిగత కార్యదర్శులను నారా లోకేష్ సూచనతో చంద్రబాబు ఆదేశాల మేరకు నియమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పదవీ బాధ్యతలను తీసుకున్న తర్వాత నియమించుకున్న ప్రజా సంబంధాల అధికారులను కూడా వదులుకోవాలని నారా లోకేష్ ముఖ్యమంత్రి కార్యాలయాధికారులతో చెప్పినట్లు సమాచారం. ప్రతి మంత్రికి పిఆర్వోను తాము నియమిస్తామని సిఎంవో మంత్రులకు తెలియజేసినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప ఓ జర్నలిస్టును తన పిఆర్వోగా నియమించాలని అనుకున్నారు. దానికి సిఎంవో అనుమతి నిరాకరించింది.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో పనిచేసినవారిని మంత్రులకు పిఆర్వోలుగా నియమించాలని నారా లోకేష్ సూచించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications