భయంగా ఉంది, స్వర్గంలో ఎన్టీఆర్: 'టి' పదనిసలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభా సమావేశాల్లో భాగంగా మంగళవారం సభలో సరదా సంభాషణలు కనిపించాయి. మంత్రులు జగగీశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, బిజెపిఎల్పీ నేత లక్ష్మణ్ తదితరులు చమత్కారంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సభలు నవ్వులు వెల్లివిరిశాయి. తొలి సభాపతిగా మధుసూదనాచారి పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.
పాత పద్ధతిలోనే మిమ్మల్ని అన్నా అని పిలుస్తానేమోనని భయంగా ఉందని, ప్రతిపక్షాలు అలసిపోయేంతగా వారికి సమయమివ్వాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఊళ్ళో మీ ఇంటికి, మా ఇంటికి ఫర్లాంగు మాత్రమే దూరమేనని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
నాడు ఎన్టీఆర్ ఎందరో యువకులకు అవకాశమిచ్చారని, వారిలో చాలామంది ఇప్పుడు కూడా సభలో ఉన్నారని, స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఈ సభను చూసి గర్వపడతారని, ఇది వరకు సభకు వస్తుంటే మార్షల్స్ హడావిడితో కిక్ బాక్సింగ్కు వస్తున్నట్లుగా ఉండేదని, ఇక కెమెరాలు ఆ వైపే ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా చూడాలని రేవంత్ రెడ్డి అన్నారు. మీరు పదహారేళ్లు మాతో కలిసి పని చేశారని, ఆ రోజు ఎన్టీఆర్, చంద్రబాబులను మెప్పించారని, చివరకు కెసిఆర్కూ మీరు నమ్మిన బంటే అయ్యారని, మీ పని తీరు అలా ఉందని టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.

కుడి వైపు కంటే ఎడమ వైపే మీ చూపు ఎక్కువగా ఉండాలని బిజెపిఎల్పీ డాక్టర్ కె లక్ష్మణ్ చమత్కరించారు. లెఫ్ట్, రైటే కాదు... స్ట్రెయిట్గా కూడా చూస్తుండండి, ఈ పది సంవత్సరాల్లో ప్రతిపక్షాలు ఇచ్చిన ఏ ఒక్క సలహాను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వం తమ సూచనలను పట్టించుకునేలా మీరు అంకుశంలా వ్యవహరించాలని బిజెపి సభ్యుడు కిషన్ రెడ్డి అన్నారు.
శాసనసభలో పాలక, ప్రతిపక్షాలు రెండు చక్రాలైతే, సభాపతి ఇరుసు లాంటి వారని, ఎటూ పక్షపాతం చూపించవద్దని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన ముగ్గురం గిరిజనులమేనని, తాము మొదటిసారి మాట్లాడుతున్నామని, మాట్లాడాలంటే భయంగా ఉందని, గతంలో తాను మాట్లాడేందుకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదని, సభకు భద్రాచల రాముని ఆశీస్సులు ఉంటాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎల్పీ తాటి వెంకటేశ్వర్లు అన్నారు.












Click it and Unblock the Notifications