1900కోట్లు: శివాజీ విగ్రహానికి జడ్ ప్లస్ ప్లస్ సెక్యూరిటీ
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై... అరేబియా సముద్రం వద్ద గల ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్కు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రతిపాదించింది. అరేబియా సముద్రం తీరం వద్ద కలిగిన ఈ శివాజీ మహారాజు విగ్రహం పర్యాటకులను బాగా ఆకట్టుకుంటోంది.
ఆంగ్ల పత్రికలలో వస్తున్న కథనం ప్రకారం... 26/11 దాడులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు ఆస్కారం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా పలుమార్లు హెచ్చరిస్తుంటుంది.
శివాజీ మెమోరియల్ను రోజుకు పదివేలమంది వరకు సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అక్కడ భద్రత పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శివాజీ మెమోరియల్ వద్ద మరింత భద్రత కోసం మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రాడార్ సిస్టంను ఏర్పాటు చేస్తారు.
మరింత భద్రత కోసం పబ్లిక్ డిపార్టుమెంట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కు, ముంబై పోలీసు, కోస్ట్ గార్డ్స్కు లేఖ రాసింది. శివాజీ మెమోరియల్ వద్ద భద్రత పెంపు విషయంలో సమన్వయం కోసం వారు లేఖ రాశారు. 190 ఫీట్ల ఎత్తు కలిగిన ఈ విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ మెమోరియల్ నారిమన్ పాయింట్ నుండి 4 కిలోమీటర్లు, రాజ్ భవన్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
యాంటీ రాడార్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా తీవ్రవాద వ్యూహాలను తిప్పికొట్టవచ్చు. సైట్ వద్ద శాశ్వత బంకర్స్ ఏర్పాటు చేయనున్నారు. 24 గంటల పాటు ఉండే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటన్నింటిని 2019 వరకు పూర్తి చేయనున్నారు. ఇందుకోసం మహా ప్రభుత్వం రూ.1900 కోట్లు విడుదల చేస్తుంది.