మోడీ సొంతూళ్లో మాట: ఇక్కడ కూడా 'బీజేపీ'కి కష్ట కాలమేనా?, జనం ఏమంటున్నారు..
అహ్మదాబాద్: గుజరాత్ వ్యాప్తంగా బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో.. ఆయన సొంత ఊరిలో ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Recommended Video
మోడీ స్వగ్రామం మెహసానా జిల్లాలోని వడ్ నగర్ అనే చిన్నపట్టణం. మోడీ టీ అమ్మానని చెప్పుకుంటున్నది ఈ ఊరిలోనే. ఉంఝా అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన ఈ ఊరిలో బీసీలు, దళితులు, ముస్లింల జనాభా ఎక్కువగా ఉండటంతో.. ఇక్కడ బీజేపీ గెలుపుపై కచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి.
అభివృద్ధి బాగానే:
మోడీ సొంతూరు కావడంతో.. వడ్నగర్తో పాటు చుట్టుపక్కల గ్రామాలను కూడా బాగానే అభివృద్ధి చేశారు. మోడీ ఒకప్పుడు టీ అమ్మారని చెబుతున్న రైల్వే స్టేషన్ను బాగానే అభివృద్ధి పరుస్తున్నారు. అయితే ఆయన టీ అమ్మిన ఇనుపషెడ్ను మాత్రం అలాగే వదిలేశారు. ఇక్కడి బస్టాండ్ను కూడా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు.
మోడీ గురించి ఇలా:
మోడీ పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఇక్కడ ప్రతీ చాలామందికి ఆయన కుటుంబంతో పరిచయాలున్నాయి. అక్కడ ఎవరినీ కదిలించినా ఇదే విషయం చెబుతారు. మోడీ తనకు సీనియర్ అనో.. లేక తనకు జూనియర్ అనో.. ఇలా చాలామంది తమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. మోడీ చదువుకున్న బీఎన్ స్కూలు కూడా రైల్వేస్టేషన్ ఎదురుగానే ఉంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయన ఇక్కడే చదువుకున్నారు. మోడీ చిన్పప్పుడు ఈత కొట్టిన సరస్సును కూడా ఇప్పుడు సుందరీకరిస్తున్నారు.
గెలుపుపై భిన్నాభిప్రాయాలు:
వడ్ నగర్ ఉన్న ఉంఝా నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బీజేపీ గెలుపుపై ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేస్టేషన్ పక్కన ఒక షాపు నడుపుతున్న జగదీశ్భాయ్ ప్రజాపతిని కదిలిస్తే.. ఈసారి బీజేపీదే విజయమని అంటున్నారు.
ఆ పక్కనే ఉన్న బాల్ బదరీశ్ మాత్రం బీజేపీ గెలుపుపై ప్రతికూలంగా స్పందించారు. మెహనాసా జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో రెండు మాత్రమే బీజేపీకి దక్కుతాయన్నారు. అంతే కాదు, "ఎన్నికల రోజు ఫలితాలు చూశాక.. నా మాట నిజమైందో లేదో మళ్లీ ఫోన్ చేయండి, కావాలంటే ఫోన్ నంబర్ ఇస్తా" అని సవాల్ విసిరాడు.
గట్టి పోటీ:
మోడీ చదువుకున్న బీఎన్ స్కూల్ ప్రిన్సిపాల్ అశోక్ గోస్వామి కూడా బీజేపీ గెలుపు కచ్చితంగా చెప్పలేమన్నారు. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందన్నారు. ప్రజలు కులమతాల ప్రాతిపదికన విడిపోవడమే ఇందుకు కారణమనేది ఆయన వాదన. మోడీ తమ ప్రాంతం వాడన్న అభిమానం బీజేపీ గెలుపుకు దోహదం చేయవచ్చన్నారు. ఆ స్కూల్లో పనిచేస్తున్న అడెంటర్లు మాత్రం బీజేపీ ఓడిపోతుందనే చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావానికి తోడు పాటీదార్లు, ఓబీసీలు, యువ నేతలు హార్దిక్ పటేల్, అల్ఫేశ్ ఠాకూర్, జిగ్నేష్ మేవాణీలు ఇక్కడ అధికంగా ప్రభావం చూపనున్నారు. ఇక్కడ శివాజీ, పటేల్, భగత్సింగ్లతో పాటు హార్దిక్ పటేల్ ఫొటోను చేర్చిన బ్యానర్లు చాలానే దర్శనమిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నిర్వహించిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీన్నిబట్టి బీజేపీ పట్ల వ్యతిరేకత బలంగానే ఉందని చెప్పవచ్చు.