మోహన్ బాబు ఆగ్రహం: బాబుకు షాక్, జగన్కు దగ్గరవుతున్నారా?
హైదరాబాద్: మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాను త్వరలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి బాధపడని రోజు లేదని, అందరికీ న్యాయం చేయాలనే తపనతో త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీలో చేరుతారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? లేక మరేదైనా ఆలోచన చేస్తున్నారా? అని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లోను చర్చ సాగుతోంది. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే, ఆయన ఇటీవలి కదలికలు.. వైసిపికి దగ్గరయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కాపు ఉద్యమాన్ని వైసిపి అధినేత జగన్ పురిగొల్పారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని ఇటీవల మంచు విష్ణు కలిశారు. తన తండ్రి మోహన్ బాబు సూచన మేరకే కలిసినట్లు ఆయన చెప్పారు. అదే సమయంలో మోహన్ బాబు గురువుగా భావించి, ప్రేమించే దాసరి నారాయణ రావును ఇటీవల జగన్ కలిశారు.
దాసరిని జగన్ తన పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సమయం తీసుకుంటానని చెప్పారని వార్తలు వచ్చినప్పటికీ.. జగన్ను మెచ్చుకున్నారు. అదే సమయంలో బుధవారం మోహన్ బాబు మాట్లాడుతూ... ఓ పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలోకి వెళ్లడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇటీవల ఏపీలో వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు వెళ్తున్న విషయం తెలిసిందే. వేరే పార్టీలోకి వెళ్లడం ఎంగిలి మెతుకులు తినడమేనని ఘాటుగా అన్నారు.
దాసరి నారాయణ రావు
ముద్రగడ పద్మనాభంను కలవాలని తన తనయుడు మంచు విష్ణుకు చెప్పడం, తన గురువు దాసరి నారాయణ రావును ఇటీవల జగన్ను కలవడం, మోహన్ బాబు వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ వైపు పావులు కదుపుతున్నారేమోననే వాదనలు వినిపిస్తున్నాయి.
వైయస్ జగన్
మోహన్ బాబును గతంలో వైయస్ జగన్ కలిసిన సందర్భాలు ఉన్నాయి. తమ మధ్య చుట్టరికం ఉందని, రాజకీయం లేదని అప్పుడు చెప్పారు. ఆ తర్వాత జగన్ను దాసరి పొగడటం, జగన్ వైపు ఉన్న కాపు నేతగా టిడిపి భావించే ముద్రగడను కలవడం గమనార్హం. దీనిని బట్టి ఆయన వైసిపిలో చేరవచ్చునని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు
మోహన్ బాబు బుధవారం మాట్లాడుతూ... టిడిపికి షాకిచ్చే కామెంట్లు కొన్ని చేశారు. వేరే పార్టీలోకి వెళ్లడం ఎంగిలి మెతుకులు తినడమేనని.. వైసిపి నుంచి టిడిపిలో చేరుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని.. ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. ఇవి టిడిపి వ్యతిరేక వ్యాఖ్యలేననే వాదనలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ
అదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణకు మోహన్ బాబు కితాబిచ్చారు. లేపాక్షి ఉత్సవాలను బాలయ్య ఘనంగా నిర్వహించారని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలకు రాజకీయాలకు సంబంధం లేదని, బాలయ్య సహ నటుడు కాబట్టి అలా వ్యాఖ్యానించి ఉంటారని అంటున్నారు.
చంద్రబాబు, వైయస్సార్
తాను ఏ రాజకీయపార్టీలో చేరుతున్న విషయాన్ని మోహన్ బాబు దాటవేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ తనకు బంధువులన్నారు. మొత్తానికి మోహన్ బాబు వ్యాఖ్యలను బాగా విశ్లేషిస్తే.. వైసిప వైపు చూస్తున్నట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు.
మోహన్ బాబు
మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఎక్కువగా జగన్కు అనుకూలంగా ఉన్నందున వైసిపిలో చేరవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, టిడిపిలోకి లేదా బిజెపి వైపు వెళ్లే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. గతంలో ఆయన బిజెపి పక్షం తరఫున ప్రచారం చేశారు.