అప్పటి వరకు నేను అనాథనే: ముద్రగడ కంటతడి
రాజమహేంద్రవరం: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం కొంత భావోద్వేగానికి గురయ్యారు. తాను అనాథనని, కాపులను బీసీల జాబితాలో చేర్చే వరకు తాను అనాథనే అనుకుంటానని ముద్రగడ పద్మనాభం కన్నీళ్లు పెట్టుకున్నారు.
మోరంపూడిలో ఆదివారం జరిగిన కాపు జేఏసీ సమావేశం చివరిలో ఆయన మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. తాను ఆమరణ నిరాహారదీక్ష చేసినప్పుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు తనను, తన భార్యను పిల్లలను కొట్టారని అన్నారు. అంతేగాక, తీవ్రంగా వేధించారని చెప్పారు.
తాను మానసికంగా కూడా ఎంతో బాధపడినట్లు చెప్పారు. ఈ బతుకెందుకని భావించానని కంటతడి పెట్టుకున్నారు. ఎన్ని బాధలుపడ్డా ఈ జాతికి మేలు చేయాలని ముందుకు వచ్చినట్లు తేల్చి చెప్పారు. కొందరు కేసులకు భయపడుతున్నారని, భయపడేవారు ఉద్యమాలకు రావద్దని సూచించారు. రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ స్ఫూర్తితో కాపు ఉద్యమం
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కాపు ఉద్యమాన్ని నిర్మించాలని కాపు నేతలు నిర్ణయించారు. జాయింట్ యాక్షన్ కమిటీలు (జెఎసి) ఏర్పాటుచేసి, క్షేత్రస్థాయిలో ఉద్యమ నిర్మాణ వ్యూహంతో ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం 13 జిల్లా కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కాపులకు రిజర్వేషన్ల సాధన ధ్యేయంగా సాగించాల్సిన ఉద్యమంపై కసరత్తు జరిపారు. ఉద్యమ పంథా ఏ విధంగా ఉండాలనే విషయంపై సమావేశంలో పాల్గొన్న పలువురు సలహాలు, సూచనలు చేశారు. వీటన్నిటి సారాంశాన్ని క్రోడీకరించి, ముఖ్యమైన నిర్ణయాలను త్వరలో హైదరాబాద్లో జరగనున్న కాపు నేతల శిఖరాగ్ర సమావేశంలో చర్చించి, ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్లో వినాయక నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం ముద్రగడ పద్మనాభం, మరో 13మంది ముఖ్య నేతలు హైదరాబాద్లో దాసరి నారాయణరావు, చిరంజీవి, పళ్లంరాజు వంటి ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని, ఉద్యమంలో భాగంగా రధయాత్రగాని, పాదయాత్రగాని చేపట్టాలని నిర్ణయించారు.
ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో రాష్టమ్రంతా నిర్వహించే ఈ పాదయాత్రకంటే ముందే జిల్లా జెఎసిలు ఆయా జిల్లాలో పాదయాత్రలు పూర్తిచేయాలని నిర్ణయించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో విద్యార్ధి, యువత, మహిళ, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాద తదితర జెఎసిలు ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించారు.
కాపు మేధావులతో జెఎసి ఏర్పాటుచేసి, ఎప్పటికపుడు సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలని నిర్ణయించారు. మహిళలకు, యువతకు ప్రధాన భూమిక కల్పించే విధంగా ఉద్యమం ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే మంజునాథ కమిషన్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టి, షెడ్యూలు ప్రకటించిందని, ఇతర వర్గాలు రెచ్చగొట్టినా, సంయమనం పాటించి కమిషన్ ముందు వివరాలు అందించాలని నిర్ణయించారు. 13 జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల నుంచి లిఖిత పూర్వకంగా నిర్దేశిత ఫార్మాట్లో అభిప్రాయ సేకరణ చేశారు.
అందరి అభిప్రాయాలను సమగ్రరీతిలో రూపొందించిన అంశాలపై హైదరాబాద్లో చర్చించిన మీదట కార్యాచరణ తీసుకుంటామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ సమావేశానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వందేసి మంది చొప్పున ప్రతినిధులు హాజరు కాగా ఇతర మిగిలిన జిల్లాల నుంచి 50 మంది చొప్పున ప్రతినిధులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications