లోకేష్ కొర్రీలు: మంత్రుల ఆఫీసుల్లో గజిబిజి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ జోక్యంతో మంత్రుల కార్యాలయాలు ఇంకా గాడిన పడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు పదవీ బాధ్యతలు తీసుకుని మూడు నెలలు దాటింది. అయితే, కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రుల వద్ద పనిచేసినవారిని వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకోవద్దనే నారా లోకేష్ సూచనను పాటించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలువురు మంత్రులకు ఇప్పటికీ వ్యక్తిగత కార్యదర్శులు లేకుండా పోయారు. నారా లోకేష్ మంత్రుల వ్యక్తిగత సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టడం లేదని అంటున్నారు.
సాధారణంగా రాష్ట్ర మంత్రులవద్ద వ్యక్తిగత కార్యదర్శులు (పిఎస్లు), అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీలు (ఎపిఎస్లు), పర్సనల్ అసిస్టెంట్లు (పిఎలు), పబ్లిక్ రిలేషషన్స్ ఆఫీసర్స్ (పిఆర్ఓలు) పని చేస్తుంటారు. జూన్లో మంత్రులు బాధ్యతలు తీసుకున్న వెంటనే కొందరు కొత్త మంత్రుల వద్ద పాత మంత్రుల సిబ్బంది చేరారు. అయితే గతంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని చేర్చుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో కొత్తలో చేరిన వారు వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు తదితరుల వద్ద పిఎస్లు, పిఎలుగా చేరిన వారు నెలరోజులుకూడా తిరగక ముందే వెళ్లిపోయారు. మంత్రుల వద్ద కొత్తగా సిబ్బందిని చేర్చుకునే కార్యక్రమం పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రస్తుతం కొద్ది మంది పనిచేస్తున్నప్పటికీ, వారికి అధికారికంగా ఉత్తర్వులు జారీ కాలేదని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రత్యేకంగా పిఆర్ఓ పేషీ లేదు.
గతంలో ముఖ్యమంత్రుల వద్ద ఒక సిపిఆర్ఓ, ముగ్గురు-నలుగురు పిఆర్ఓలు, ఇతర సిబ్బంది ఉండేవారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో విజయకుమార్ సిపిఆర్ఓగా పనిచేశారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి వద్ద చంద్రశేఖరరెడ్డి సిపిఆర్ఓగా పనిచేశారు. రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డిల వద్ద వేర్వేరు వ్యక్తులు సిపిఆర్ఓలుగా పనిచేశారు. ప్రస్తుతం చంద్రబాబు వద్ద పూర్తిస్థాయి పిఆర్ పేషీ లేకపోవడంతో ‘మీడియాకు-ముఖ్యమంత్రి కార్యాలయానికి' అనుసంధానం పూర్తిస్థాయిలో కొనసాగడం లేదు. క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ‘మీడియా సలహాదారు'గా పనిచేస్తున్న పరకాల ప్రభాకర్ పేరుతో ప్రస్తుతానికి పత్రికా ప్రకటనలు వెలువడుతున్నాయి.
మంత్రుల వద్ద కొద్ది మంది ఉన్నప్పటికీ వారికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో తూతూ మంత్రంగా పనులు జరుగుతున్నాయని ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం వచ్చింది. వివిధ శాఖలకు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అడిషనల్ కార్యదర్శులు, ఎస్ఓలు, ఎస్ఓలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. వివిధ శాఖలకు సిబ్బంది కేటాయింపు జరిగినప్పటికీ, ఇంకా వారు ఒక గాడిలో పడి పనిచేయడం లేదు.