బాబుకు రిలీఫ్: నారా లోకేష్ ట్యాబ్ కల్చర్
హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిపై ఉండే ఒత్తిడిని ఆయన తనయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ సగం కన్నా ఎక్కువే తగ్గిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీ పటిష్టతకు, విస్తరణకు నారా లోకేష్ మరో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను క్రోడీకిరంచి, పట్టిక రూపంలో రూపొందించే కొత్త విధానానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. ప్రతి పార్టీ శాఖకు టాబ్లెట్స్ అందించి, ప్రతి రోజూ అక్కడ నుంచి వివరాలను సేకరిస్తారు. వాటి ఆధారంగా ప్రతిదానిపై నారా లోకేష్ చర్చించి నిర్ణయం తీుసకుని, తగిన సూచనలు చేస్తారు.
నారా లోకేష్ పార్టీ కార్యక్రమాల గురించి ఓ ప్రముఖ ఆంగ్లదినపత్రిక సవివరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది.గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా పరిషత్, జిల్లా పార్టీ నాయకులు చర్చించి టాబ్లెట్ల ద్వారా సిఫార్సు చేసిన మేరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారు. అంతేకాకుండా నారా లోకేష్, ఆయన బృందంలోని సభ్యులు పార్టీ శానససభ్యుల, మంత్రులతో పాటు ముఖ్యమంత్రి పనితీరుపై నివేదిక కార్డును తయారు చేస్తారు. ఇటువంటి రిపోర్ట్ కార్డును ఇటీవలే అందరికీ పంపణీ చేశారు. దాని వల్ల ప్రతి ఒక్కరి వ్యక్తిగత పనితీరుపై అంచనా వేయడంతో పాటు ప్రజల నాడి కూడా పట్టుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
పార్టీలోని వ్యవస్థలను గాడిలో పెట్టే పనిని నారా లోకేష్ తన భుజాల మీద వేసుకున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించి,త వాటి మంచీచెడులను బేరీజు వేస్తున్నారు. తాను కొన్ని ప్రతిపాదనలను పార్టీ అధ్యక్షుడి ముందు పెడుతున్నానని, నిర్ణయాలు మాత్రం ఆయనే తీసుకుంటారని, తాను నిర్ణయాలు చేయబోనని నారా లోకేష్ దక్కన్ క్రానికల్ ప్రతినిధితో అన్నారు.
నారా లోకేష్ ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయానికి వస్తారు. ఎన్నికల సమయంలో తాను ఎంపిక చేసుకున్న తన బృందంతో రహస్య సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ అంశాలపై వారితో చర్చిస్తారు. మీడియా వార్తాకథనాలను స్కాన్ చేస్తారు. ఆ తర్వాత తన కోసం వచ్చినవారిని కలుసుకుంటారు. ప్రతి రోజూ 400 నుంచి 500 మందిని ఆయన కలుసుకుంటున్నారు.
ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత తన అపాయింట్మెంట్ తీసుకున్న పార్టీ నేతలను కలుస్తారు. వీరిలో మంత్రులు, శాసనసభ్యుల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఉంటారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిదిన్నరకు ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో తండ్రీతనయులు కూర్చుని తీసుకోవాల్సిన నిర్ణయాలను రూపొందిస్తారు.