'ఆపరేషన్ నయీం': అక్కడే మలుపు తిరిగింది!
హైదరాబాద్: ప్రజాప్రతినిధులను, రాజకీయ నాయకులను బెదిరించి అంతమొందించేందుకు రెక్కీ నిర్వహించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ నయీంను వలపన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టుకోవాలని భావించింది. కానీ ఎదురు కాల్పుల్లో నయీం మృతి చెందాడు.
అతనిని పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్పందీగా ముందుకెళ్లిందని తెలుస్తోంది. నయీమ్ను పట్టుకునే బాధ్యతను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ), కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐఎల్) విభాగాలకు అప్పగించారు. నయీంను సజీవంగానే పట్టుకోవాలని భావించారు.
నెల రోజుల క్రితమే ప్లాన్ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఎస్ఐబీ, సీఐఎల్ సిబ్బంది గతనెల 22 నుంచి జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో నయీం కార్యకలాపాలపై నివేదికలు తెప్పించుకున్నారు. నయీం బాధితుల చిట్టాను సేకరించారు.
ప్రత్యేక మొబైల్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో మెదక్ జిల్లాలో ఓ జడ్పీటీసీ భర్తను నయీం బెదిరించాడు. వారితో అధికారులు కేసు పెట్టించారు. తమ కొన్ని ప్లాన్లు నయీంకు చేరడంతో అధికారులు ప్లాన్ మార్చారని తెలుస్తోంది. అధికారులు నయీంకు సహకరించే వారి చిట్టాను పరిశీలించారు. నయీం కదలికల పైన కన్నేశారు.
రూ.10వేల కోట్ల నయీం సామ్రాజ్యం, హైద్రాబాద్ అడ్డా, ఆస్తుల చిట్టా పెద్దదే
సెటిల్మెంట్లు, బెదిరింపులతో ఆయుధాల సరఫరాలోనూ నయీం చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా అతని స్థావరాలు, అనుచరుల కదలికలపై కన్నేశారని తెలుస్తోంది. ఈ నెల 1న భువనగిరిలో పట్టుకోవాలని భావించినా, అది కుదరలేదు. అతనిని పట్టుకునేందుకు ఒకటికి రెండుసార్లు ప్లాన్ చేసినా కుదరలేదు.
అదే సమయంలో నయీం షాద్ నగర్ సమీపంలోని మిలీనియం టౌన్ షిప్కు తరుచూ వెళ్తున్నట్లు గుర్తించారు. అక్కడ నిఘా వేశారు. ఈ నెల 5న షాద్ నగర్ ఏరియాలో నయీం సెల్ఫోన్కు చెందిన సిగ్నల్స్ దొరికాయి. జీపీఎస్ ఆధారంగా నయీమ్ కదలికలను వెనువెంటనే తెలుసుకున్నారు.
సోమవారం ఇలా...
హైదరాబాద్ నుంచి ఖరీదైన కారులో స్థానిక మిలీనియం టౌన్షిప్లో ఉంటున్న తనకు సన్నిహితుడైన పాషా నయీం ఇంటికి వస్తుండగా.. అప్పటికే అక్కడున్న పోలీసులు ఉదయం తొమ్మిది గంటల సమయంలో కారును అడ్డగించారు.
తన వద్ద ఉన్న ఏకే 47 ఆయుధంతో ప్రతిఘటించేందుకు నయీం సిద్ధపడగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే కూలిపోయాడు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
కాల్పులు జరిగిన ప్రాంతం హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షాద్ నగర్ పట్టణం నుంచి కొత్తూరుకు వెళ్లే పాత జాతీయ రహదారిలో మిలీనియం టౌన్షిప్ ఉంది. ఈ మార్గంలో ప్రధాన రహదారికి కేవలం ఫర్లాంగు దూరంలో పాషా ఇల్లు ఉంది. నయీం అక్కడకు వస్తున్నట్లు ముందే సమాచారం అందిన పోలీసులు అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది.
నయీం షాకింగ్: ఇంటికి గట్టి భద్రత, ఆడవాళ్లతో ప్రయాణం, డెన్లో స్త్రీలు
నయీం కారులో ఆ ఇంటికి చేరుకుంటుండగా వంద అడుగుల దూరంలో ఉండగానే పోలీసులు ఆపేందుకు యత్నించారు. అతడు ప్రతిఘటించడంతో కాల్పులకు దిగారు. అక్కడ ఒకవైపు పార్కు ఉండగా, మరోవైపు ఖాళీ స్థలం ఉంది. పోలీసులు రెండు వైపుల నుంచి దాడి చేసిన కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. కాగా, అధికార పార్టీ నేతలను కూడా బెదిరించుకుంటూ.. పోలీసులతో సాన్నిహిత్యం.. ఇలా అతివిశ్వాసం నయీం హత్యకు దారి తీసిందంటున్నారు.
మీడియాలో వస్తున్న వార్తల మేరకు... రెండు రోజుల క్రితం నయీం నమ్మిన బంట్లు ఇద్దరిని నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇక్కడే మలుపు తిరిగిందని చెబుతున్నారు. వీరు ఇచ్చిన సమాచారంతో ఈనెల 6న తెల్లవారుజామునే నయీం జాడను పక్కాగా కనిపెట్టారని అంటున్నారు. అయితే, ఆదివారం ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.