పవన్కు 'డబ్బు' చిక్కు, బ్రదర్ అనిల్పై టిడిపి
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రజలు ఓటుకు నోటు, పార్టీల తరఫున ఇచ్చే బహుమతులు తీసుకొని ఓటు మాత్రం టిడిపి, బిజెపి అభ్యర్థులకు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారని, ఇలా ప్రచారం చేయడం తీవ్ర నేరమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది.
సాక్షి, అనీల్లపై టిడిపి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రచారానికి సాక్షి దిన పత్రిక, సాక్షి టీవీ ఛానల్ కరపత్రంలా మారాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని టిడిపి ప్రధాన కార్యదర్శి షరీఫ్ ఈసికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కించపరుస్తూ జగన్కు అనుకూలంగా సాక్షిలో కథనాలు ప్రచురించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ పార్టీకి అనుకూలంగా సాక్షిలో వస్తున్న కథనాలను చెల్లింపు వార్తలుగా పరిగణించాలని కోరారు.
అలాగే చర్చిల్లో ప్రచారం చేస్తున్న జగన్ బావ అనిల్ కుమార్ పైన టిడిపి పిర్యాదు చేసింది. గన్నవరం నియోజకవర్గంలోని రోటరీ క్లబ్లో పాస్టర్లకు భోజనం ఏర్పాటు చేసి డబ్బు పంచినట్లు ఈసికి తెలిపింది. పామర్రు, కైకలూరు నియోజకవర్గాల్లోని చర్చిల్లో సైతం ప్రచారం చేసిందని, డబ్బు పంచారని పేర్కొంది. అనిల్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని కోరింది.
సీమాంధ్రలోని పలు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు నగదు, మద్యం పంచుతున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి టిడి జనార్ధన్ ఆదివారం ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, టిడిపిలు పలుచోట్ల పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.