జగన్కు 'బుగ్గన' చిక్కు: గెలవలేరని షాకిచ్చిన పెద్దిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పీఏసీ కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి జగన్ పీఏసీ చైర్మన్ పదవిని అప్పగించారు.
దీనిపై వైసిపిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అసంతృప్తి వినిపిస్తోంది. ఈ పదవిని సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు ఆశించారు. అయితే అనూహ్యంగా జగన్... బుగ్గనకు అవకాశం ఇచ్చారు. అమర్నాథ్, జ్యోతుల నిన్ననే ఈ అంశంపై స్పందించారు.
దీనిపై తాజాగా, పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్కు అత్యంత సన్నిహితుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి తండ్రిగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వైసిపిలో కీలక నేత. దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనతో పూర్తి స్థాయిలో విభేదాలు కొనసాగించారు.
అయితే, తన కొడుకు మిథున్ రెడ్డి మాట కాదనలేక ఆయన వైసిపిలో చేరారు. తాజాగా, పీఏసీ చైర్మన్ పదవిపై ఆయన తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఏసీ చైర్మన్ ఓ పెద్ద పదవా? దానిని చేపట్టినవారెవరూ ఆ తర్వాత ప్రత్యక్షంగా ప్రజలతో ఎన్నికై ఎమ్మెల్యే కాలేదని, యనమల రామకృష్ణుడు పీఏసీ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత నాలుగు సార్లు ఓడిపోయారన్నారు.
పెద్దిరెడ్డి
పీఏసీ చైర్మన్ పదవిని ఆశించిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు జగన్కు షాక్ అనే చెప్పవచ్చు. సీనియర్లను జగన్ పట్టించుకోవడం లేదని అర్థమవుతోందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారట.
బుగ్గన
తొలిసారి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, రోజా వంటి వారికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే వైసిపిలో సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారట.
అమర్నాథ్ రెడ్డి
మంగళవారం అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ... కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి వస్తుందని భావించామన్నారు. బుగ్గనకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు జగన్ ఎవరికీ చెప్పకపోవడం ఆశ్చర్యం వేసిందన్నారు. చిత్తూరు వాళ్లు తెలివైన వారనుకుంటారని, కానీ నష్టపోయేది వాళ్లే అన్నారు.
జ్యోతుల నెహ్రూ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పీఏసీ చైర్మన్ పదవిని ఆశించారు. అయితే జగన్ నిర్ణయంపై ఆయన అసంతృప్తితో ఉన్నప్పటికీ ఆచితూచి స్పందిస్తున్నారు.