గడ్కరీకి బాబు కౌంటర్: పోలవరంపై తన పట్టు తనదే
అమరావతి: కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇవ్వదలుచుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ను మార్చే ప్రసక్తి లేదని గడ్కరీ ఇది వరకే స్పష్టం చేశారు.
Recommended Video
అయితే, ఆ విషయంలో చంద్రబాబు తన పట్టు తానే పడుతున్నారు. అందుకు కొత్త ప్రతిపాదనను తెర మీదికి తెచ్చారు. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ని తప్పిస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం కావనే అభిప్రాయంతో ఉన్న ఆయన కొత్త ప్రతిపాదనను తెర మీదికి తీసుకు వచ్చినట్లు కనిపిస్తున్నారు.
చంద్రబాబు కొత్త ప్రతిపాదన ఇదీ..
పోలవరంర ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ మరికొన్ని కాంట్రాక్టు సంస్థలతో కలిసి ఓ కన్సార్షియంగా ఏర్పడాలని భావిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఆ కన్సార్షియానికి పూర్తిస్థాయిలో పనులు అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ ప్రతిపాదన చేశారు.
కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు
పోలవరం పనులను మైనస్ 14 శాతానికి చేస్తానని ముందుకొచ్చిన ట్రాన్స్ట్రాయ్తో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిరగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, అయితే ఆ సంస్థ పనులను వేగంగా చేయలేకపోతోందని చంద్రబాబు అన్నారు. పని ముందుకు సాగని ఒప్పందాన్ని ఏం చేసుకుంటామని, లాకర్లో దాచుకుంటామా? ఆయన అన్నారు.
అందుకే ప్రత్యేకంగా టెండర్లు
పనులు వేగంగా జరగకపోవడం వల్లనే స్పిల్వే, చానల్ పనులకు ప్రత్యేకంగా టెండర్లు పిలిచామని, అయితే వాటిపై ట్రాన్స్ట్రాయ్ అభ్యంతరాలు తెలపడంతో కేంద్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని చంద్రబాబుబ తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను ఒకటి రెండు రోజుల్లో అందజేస్తుందని, ఈ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.
టెండర్ల ప్రక్రియ నడుస్తుంది....
నివేదిక కోసం చూస్తూనే ఈలోగా టెండరు ప్రక్రియ కూడా నడుస్తుందని చంద్రబాబు చెప్పారు. అయితే, ట్రాన్స్ట్రాయ్ సంస్థ మరికొన్ని సంస్థలతో కలిసి కన్సార్షియంగా ఏర్పడేందుకు సానుకూలంగా ఉన్నామని చెబుతోందని, దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాని, దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరాలు ఆయన అన్నారు.
ట్రాన్స్ట్రాయ్కి చంద్రబాబు ఆదేశాలు...
జనవరి 14 అంటే సంక్రాంతి నాటికి పోలవరం ప్రాజెక్టుకు ఒక గేటును బిగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ను చంద్రబాబు ఆదేశించారు. పోలవరం పునులన్నీ పారదర్శకంగా ఉండేలా సమాచారాన్నంతటినీ ఆన్లైన్లో పొందుపరచాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
చంద్రబాబు ఇలా నడకనే...
ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చినప్పుడు చంద్రబాబు వాహనాల్లో ఆయా పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి పనుల పురోగతిని పరిశీలించేవారు. కానీ ఈసారి ఆద్యంతం నడుస్తూనే పోలవరంర పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ కేపీఎంజీ పోలవరం ప్రాజెక్టుపై రూపొందించిన ఓ డాక్యుమెంటరీని ప్రదర్శించింది. సమీక్ష సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన కాంట్రాక్టు సంస్థ డిమాండ్లపై అధ్యయనం చేస్తున్న భార్గవ నేతృత్వలోని త్రిసభ్య కమిటీతో చంద్రబాబు సమావేశమయ్యారు.