బాలీవుడ్, టివి నటుల సాయం కోరిన ముంబై పోలీస్
ముంబై: ఇటీవలి కాలంలో మహిళలపై, అమ్మాయిల పైన అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వాటి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా క్రైమ్కు వ్యతిరేకంగా, మహిళల స్వీయ రక్షణ విషయాల పైన ప్రజలను జాగృతం చేయాలని ముంబై పోలీసులు బాలీవుడ్, టీవి ప్రముఖులను కోరుతున్నారు.
అదే సమయంలో సినీ, టెలివిజన్ ప్రముఖులు తమ తమ పాత్రలలో పోలీసులను, మహిళలను ఉన్నతంగా చూపించే ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ముంబై నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ... భద్రత, మహిళల పట్ల సాగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని తాము పలువురు ప్రముఖులను కోరుతున్నామని చెప్పారు. వారి ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం పెంచే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. బాలీవుడ్ తదితర రంగాల్లో ఉన్న ప్రముఖుల సహాయం ఇలాంటి వాటికి అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇందులో భాగంగా సబర్బన్ అందేరీలోని ఆర్టీవో కార్యాలయంలో బాలీవుడ్, టీవి ప్రముఖులతో పోలీసులు భేటీ అయ్యారు. భేటీ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ప్రముఖులు మహిళల పట్ల జరుగుతున్న ఘటనలపై స్పందించాల్సిన అవసరముందన్నారు.
ఈ బేటీలో జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) హిమాన్షు రాయ్, జాయింట్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) సదానంద్, బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, జావెద్ అక్తర్, సలీమ్ ఖాన్, కబీర్ ఖాన్, రాఖేష్ ఓంప్రకాశ్ మెహ్రా, మధుర్ భండార్కర్, ఏక్తా కపూర్, ప్రకాశ్ ఝా తదితర అరవై మంది పాల్గొన్నారు.
సమావేశంలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పైన చర్చించినట్లు సత్యపాల్ సింగ్ చెప్పారు. అలాగే పోలీసులు, బాలీవుడ్, టీవి ప్రముఖులతో కలిసి చేయాల్సిన అంశాల పైన చర్చించామన్నారు. సమావేశం అనుకూల వాతావరణంలో జరిగిందన్నారు. పలువురు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారని, భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు.