ఎవరీ కిషోర్: నాడు మోడీని గెలిపించాడు, నేడు నితీశ్ను
పాట్నా: 2012లో గుజరాత్ సీఎంగా నరేంద్రమోడీ వరుస విజయం సాధించడంతో పాటు, 2014లో దేశ ప్రధానిగా అద్భుత విజయం సాధించడంలో ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అదే వ్యక్తి బీహార్లో బీజేపీ ఓటమికి కారణమయ్యాడు. ఆయనే 37 ఏళ్ల ప్రశాంత్ కిషోర్.
బీహార్లో నితీశ్ కుమార్ వరుసగా మూడో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు కారణమయ్యాడు. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాకు చెందిన ఓ ఉన్నత విద్యావంతుడు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా ఆఫ్రికాలో చేస్తున్న ఉద్యోగాన్ని 2011లో వదలిపెట్టి దేశానికి తిరిగొచ్చారు.
తర్వాత ఎంబీఏ, ఐఐటీ గ్రాడ్యుయేట్స్ ఇతర ఉన్నత విద్యావంతులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ కిషోర్ దేశంలో ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించిన ప్రశాంత్ ‘చాయ్ పే చర్చా' పేరిట వినూత్న ప్రచారానికి తెర తీశారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘చాయ్ పే చర్చా' దేశవ్యాప్తంగా ఓటర్లను ఆకట్టుకుంది. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కేందుకు ప్రధాన భూమిక పోషించింది. సాధారణ ఎన్నికల్లో మోడీ వెంట నడిచిన ప్రశాంత్ కిషోర్ బిహార్ ఎన్నికల్లో రూటు మార్చి నితీశ్కే పట్టం కట్టాలంటూ ప్రచారం చేశారు.
మహాకూటమి ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. చాయ్ పే చర్చా తరహాలోనే నితీశ్ కోసం ‘‘పర్చా పే చర్చా'' (కరపత్రాలపై చర్చ) కార్యక్రమాన్ని రూపొందించారు. పదేళ్ల నితీశ్ పాలనలో ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.
దీనికోసం ‘‘ప్రతి ఇంటి తలుపూ తడదాం'' అనే మరో కార్యక్రమాన్నీ చేపట్టి నితీశ్ను ప్రజలకు మరింత చేరువ చేశారు. దీని ఫలితంగానే బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ కూటమికి బీహారీ ఓటర్లు షాకిచ్చి నితీశ్ కుమార్కే పట్టం కట్టారు.