రాయల టికి మంత్రాంగం, వెనుక ఆజాద్: చెరీ సగం

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో పలు సమస్యలకు రాయల తెలంగాణనే శాశ్వత పరిష్కారమని, ఈ ప్రతిపాదన అంగీకరించాలని కేంద్రమంత్రుల బృందం(జివోఎం) సభ్యులు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారని తెలుస్తోంది. తెలంగాణకి విద్యుత్తు, శ్రీశైలం కేంద్రంగా సాగునీరు, సీమాంధ్రకు రాజధాని ఎంపిక, శాసన సభలో రాష్ట్ర విభజన బిల్లుకు సానుకూలత, అవసరమైతే తీర్మానం ఆమోదించడం, వంటి పలు క్లిష్టమైన అంసాల్లో ఇబ్బందులు తొలగుతాయని దామోదరకు జివోఎం సభ్యులు జైరాం రమేష్ వివరించారట.

అధిష్టానం ప్రస్తుతం తెలంగాణ? రాయల తెలంగాణ? ఈ రెండింటి మధ్య కేంద్రం ఊగిసలాడుతోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆ రెండింటికీ సిద్ధమవుతున్నారట. పది జిల్లాలతో కూడిన తెలంగాణ... కర్నూలు, అనంతపురం కూడా కలిసిన రాయల తెలంగాణ... ఈ రెండు ప్రతిపాదనలను అధికారికంగా సిద్ధం చేయాలని షిండే తన శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

Telangana

సిడబ్ల్యూసి తీర్మానం, కేబినెట్ నోట్ ప్రకారం పది జిల్లాల తెలంగాణ రూపొందిస్తే హైదరాబాద్ ప్రతిపత్తి ఎలా ఉండాలి? పన్నెండు జిల్లాల తెలంగాణను ఏర్పరిస్తే ఉమ్మడి రాజధాని ఏ విధంగా ఉండాలన్న విషయంపై ఆయన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం ముగిసిన తర్వాత.. .రాత్రి 9.30 గంటలకు తన శాఖ అధికారులకు ఈ విషయం చెప్పినట్లు సమాచారం. షిండే ఆదేశాల మేరకు అధికారులు ఈ రెండు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.

డిసెంబర్ 3న జరిగే కేంద్ర కేబినెట్ దేనిని ఖరారు చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది. అసెంబ్లీకి రాయల తెలంగాణ బిల్లు వెళ్లినా వెళ్లొచ్చంటున్నారు. సోమవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. రాయల తెలంగాణకు జై కొడితే భద్రాచలం రెవెన్యూ డివిజన్ తెలంగాణలోనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే గ్రామాలను కూడా సీమాంధ్రలో చేర్చకపోవచ్చునని తెలుస్తోంది.

కొన్నాళ్లుగా కేవలం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుపైనే మంత్రుల బృందం, అధిష్ఠానం దృష్టి కేంద్రీకరిస్తుండగా ఇప్పుడు మళ్లీ రాయల తెలంగాణ ఏర్పాటు తెర ముందుకు రావడం వెనుక కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి, జివోఎం సభ్యుడు గులాం నబీ ఆజాద్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాయల తెలంగాణ వల్ల రాష్ట్రానికి సమన్యాయం చేసినట్లవుతుందని ఆయన వాదిస్తున్నారట.

శనివారం ఆయన సోనియా గాంధీని కలిసి ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా ప్రతిపాదించడం, తెలంగాణలో కూడా కొందరు నేతల ప్రోద్బలం ఉండటంతో ఆజాద్ వాదనలకు బలం చేకూరింది. దీనివల్ల 21 లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కుతాయని, తెరాస పట్టు కూడా తగ్గిపోతుందని ఆజాద్ వాదిస్తున్నట్లు తెలిసింది.

ఆజాద్ ప్రమేయంతోనే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రఘువీరా రెడ్డి వంటి నేతలు అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి గ్రామసభల ప్రతిపాదనలు పంపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు రాయల తెలంగాణ ప్రతిపాదన మాత్రమేనని, దీనిపై స్పందనలు తెలుసుకునేందుకే ముందుకు తెచ్చారని అభిప్రాయపడుతున్న వారు కూడా ఉన్నారు.

కాగా, రాయల తెలంగాణ అయితే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు చెరీ సగం అవుతాయి. తెలంగాణలో 12, సీమాంధ్రలో 11 జిల్లాలు ఉంటాయి. రాయల తెలంగాణలో అయితే 12 జిల్లాల రాయల విస్తీర్ణం 1,49,128 చదరపు కిలోమీటర్లు, సీమాంధ్ర విస్తీర్ణం 1,25,872 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. రాయల తెలంగాణ జనాభా 4,34,16,673 ఉండగా, సీమాంధ్ర జనాభా 4,12,48,860గా ఉంటుంది. రాయల తెలంగాణ, సీమాంధ్ర అయితే ఇరు రాష్ట్రాల్లో 147 అసెంబ్లీ, 21 లోకసభ సీట్ల చొప్పున ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+