కేసీఆర్! ఆంధ్రావాళ్లని పిలుస్తావా: బాబుని లాగిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించి తెలంగాణ సీఎం కేసీఆర్ పైన ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు.
ఇన్నాళ్లు అసలు ప్రతిపక్షాలే లేవని చెప్పిన సీఎం కేసీఆర్, ఇప్పుడు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని అనడం విడ్డూరమని, ప్రతిపక్షమే లేనప్పుడు అలా ఎలా మాట్లాడుతారని కౌంటర్ ఇచ్చారు.
అదే సమయంలో ఆంద్రోళ్లకు అమ్ముడుపోయి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ముంపు బాధిత ప్రజలు, ప్రతిపక్షాలు చూస్తున్నాయని చెప్పడంపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చండీయాగానికి చంద్రబాబు వెంకయ్య, రాధాకృష్ణ, రామోజీ రావు, కేవీపీ రామచంద్ర రావు.. ఇలా ఆంద్రోళ్లనే కేసీఆర్ పిలిచారని, తెలంగాణ కోసం పాటుపడిన ఏ ఒక్కరిని పిలువలేదని ఎద్దేవా చేశారు. పైవారంతా తెలంగాణకు అడ్డుపడిన వారేనని కేసీఆర్ పలుమార్లు ఆరోపించారని గుర్తు చేశారు.

కేసీఆర్ ఆంధ్రోళ్లతో అంటకాగుతూ ప్రతిపక్షాలను అనడం విడ్డూరమన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తూ, దండుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు, నీటి ప్రాజెక్టులకు ఆంధ్రా వాళ్లు అడ్డుపడుతున్నారని కేసీఆర్ చెబుతున్నారని, అలాంటప్పుడు అమరావతి వెళ్లి బిర్యానీ ఎలా తిని వచ్చావని ప్రశ్నించారు.
తెలంగాణకు అడ్డుపడ్డవాళ్లే కేసీఆర్కు ఆత్మీయులయ్యారని దుయ్యబట్టారు. తద్వారా ఆయన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులను టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారు.
సీఎం నియోజకవర్గంలో రేవంత్కు ఘన స్వాగతం
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి శనివారం ఘన స్వాగతం లభించింది. ఆయన దీక్షకు స్థానిక రైతులు, మహిళలు, యువత మద్దతిచ్చింది. సీఎం నియోజకవర్గ పరిధిలో ఆయనకు లభించిన స్వాగతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications