రోహిత్ సూసైడ్ నోట్: వీసీకి, దత్తాత్రేయకు చిక్కులేనా?
హైదరాబాద్: తన సూసైడ్ నోట్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) విద్యార్థి వేముల రోహిత్ పేరు రాయనప్పటికీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయకు చిక్కులు తప్పేట్లు లేవు. తన సూసైడ్ నోట్లో రోహిత్ ఎవరి పేరును కూడా ప్రస్తావించలేదు.
రోహిత్ ఆత్మహత్యపై పోలీసులు బండారు దత్తాత్రేయపై, విశ్వవిద్యాలయం వీసీ పొదిలె అప్పారావుపై కేసులు నమోదు చేశారు. వారి పేర్లు సూసైడ్ నోట్లో లేనప్పటికీ వారికి చిక్కులు తప్పవని అంటున్నారు. సూసైడ్ నోట్ తుది సాక్ష్యం కాదని అంటున్నారు.
గతంలోని హైకోర్టు తీర్పుల ప్రకారం రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ప్రధానమవుతాయి. సూసైడ్ నోట్లో రోహిత్ ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ చేసిన వాదన కోర్టులో నిలిచే పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు.
సాంఘిక బహిష్కరణ, సస్పెన్షన్, ఇతర సమస్యలు రోహిత్ ఆత్మహత్యకు దారి తీశాయని పోలీసులు అనుకుంటే నిందితులను ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. కాగా, రోహిత్ 2015 డిసెంబర్ 18వ తేదీన వీసీ అప్పారావుకు రాసిన తొలి లేఖ సాక్ష్యంగా పనికి వస్తుందని చెబుతున్నారు.
రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు కోర్టు విచారణలో ప్రధానంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు రోహిత్ ఎన్ని లేఖలు రాశాడనేది, ఆ లేఖల్లో ఉన్నదేమిటనేది కూడా పరిగణనలోకి వస్తాయని అంటున్నారు. కాగా, వైస్ చాన్సలర్పై ఆరోపణలు చేస్తూ తాను చచ్చిపోతానని రోహిత్ రాసిన లేఖ ప్రధానంగా మారుతుందని అంటున్నారు.
వీసికి రాసిన లేఖను సూసైడ్ నోట్ నుంచి విడదీసి చూడరని, రోహిత్ రాసిన లేఖలన్నింటినీ కలిపే చూస్తారని అంటున్నారు. సూసైడ్ నోట్ను మాత్రమే చూపించి నిందితులు బయటపడలేరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.