జయ రూ.113 కోట్ల ఆస్తులు శశికళ ఫ్యామిలీకే...
జయలలితకు చెందిన 113.73 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఆమె ప్రియసఖి శశికళ కటుంబానికే చెందుతాయా... రెండేళ్ల క్రితమే జయలలిత ఆ మేరకు విల్ రాసినట్లు వార్తలు వస్తున్నాయి.
చెన్నై: దివంగత నేత జయలలితకు చెందిన రూ.113.73 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఆమె ప్రియసఖి శశికళ నటరాజన్కే వారసత్వంగా సంక్రమిస్తాయనే మాట వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి జయలలిత రెండేళ్ల క్రితమే విల్ రాశారంటూ టెలిగ్రాఫ్ ఓ వార్తాకథనం ప్రచురించింది.
టెలిగ్రాఫ్ కథనం ప్రకారం - పోయెస్ గార్డెన్లోని ఇల్లు శశికళకు చెందుతుందని విశ్వసనీయమైన వర్గాలు చెప్పాయి. నీలిగిరీస్లోోని కోదనాడ్ ఎస్టేట్, జయ పబ్లికేషన్స్, శశి ఎంటరైప్రైజెస్, ఇతర వ్యాపారాల్లో ఇద్దరు మిత్రులు భాగస్వాములు. అవి జీవించి ఉన్న భాగస్వామికి చెందుతాయి.
ముఖ్యమంత్రి పదవి వద్దన్న శశికళ, ప్రధాన కార్యదర్శిగా, చక్రం తిప్పేది ఆమెనే
హైదరాబాదులోని ఫామ్హౌస్ ఇలవరసి కుమారుడు వివేక్ జయరామన్కు, శశికళ సోదరుడు జయరామన్కుక చెందుతాయి. ఇటీవలి ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం జయలలితకు 113.73 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. వాటిలో స్థిరాస్తుల విలువ రూ.72,09 కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ.41,63 కోట్లు. జయ చేతిలో 41 వేల నగదు ఉంది.
వేద నిలయం ఇలా విస్తరించి ఉంది..
పోయెస్ గార్డెన్లోని జయలలిత నివాసం వేద నిలయం 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అందులో బిల్టప్ ఏరియా 21,662 చదరువు అడుగులు .ఇది రూ.43.32 లక్షలు చేస్తుంది. ఆమె, ఆమె తల్లి దాన్ని 1967లో రూ.1.32 లక్షలకు కొనుగోలు చేశారు.
తెలంగాణలో ఆస్తులు ఇలా...
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో 14.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తమిళనాడులోని కాంచీపురం గ్రామ సమీపంలోని చెయ్యూరులో 3.43 ఎకరాల భూమి ఉంది. తెలంగాణలోని భూమిని జయలలిత, ఆమె తల్లి సంధ్య 1968లో, చెయ్యూరు భూమిని 1981లో కొనుగోలు చేశారు.
జయలలిత వాహనాలు ఇలా..
జయలలితకు రెండు టయోటా ప్రాడో ఎస్యువీలు ఉన్నాయి. వాటి విలువ రూ.40 లక్షలు ఉంటుంది. మరో టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహీంద్ర జీపు, అంబాసిడర్ కారు , మహీంద్ర బొలెరో, స్వరాజ్ మజాదా మాక్సి, , కాంటెస్సా (1990 మోడల్) ఉన్నాయి. వాటి విలువ 42.25 లక్షల రూపాయలు ఉంటుంది.
చిన్నమ్మ శశికళ ఇలా వచ్చారు.
చిన్నమ్మగా పిలిచే శశికళ వీడియో కంపెనీ యజమానిగా 1980 దశకంలో జయలలితకు పరిచమయ్యారు. దక్షిణ తమిళనాడులోని మన్నారుగుడి ఆమె స్వస్థలం. ఆ తర్వాత జయలలితకు ప్రియసఖిగా మారి వేద నిలయంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో అన్నాడియంకె పార్టీపై కూడా ఆధిపత్యం సాధించారు.
జయ వెనక సీట్లో కూర్చుని...
జయలలిత వాహనంలో శశికళ ఎప్పుడూ వెనక సీట్లో కూర్చుని కనిపించేవారు. జయలలిత ఎన్నికల ప్రచారంలో చేసే ప్రసంగాలను పరిశీలిస్తూ, తన అక్కకు సహాయం అందిస్తూ కనిపించేవారు. అక్రమాస్తుల కేసులో ఇద్దరు కూడా నిందితులు.