అమ్మకేమైంది?: అంతా రహస్యమే, టెన్షన్
చెన్నై: గత పది రోజుల క్రితం ఆనారోగ్యం కారణంగా చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్తో జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు.
అయితే గత రెండు రోజులు నుంచి ఆమె ఆరోగ్యం గురించి వైద్యులు హెల్త్ బులిటెన్లు కూడా విడుదల చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తమిళనాడుకు చెందిన రీగన్ ఎస్ బెల్ అనే సుప్రీం కోర్టు న్యాయవాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మూడు పేజీలే లేఖరాశారు.
ఆపోలో ఏం జరుగుతుంది?
అసలు చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి అంత రహస్యం ఎందుకు పాటిస్తున్నారో తెలుసుకోవాలంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సీఎం ఆరోగ్యం గురించి ఎవరూ ఏమీ బయటకు చెప్పడం లేదని అందులో పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద వెయ్యి మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ఆగిపోయిందని, రాష్ట్ర మంత్రివర్గానికి కూడా ఆమె ఆరోగ్యం గురించి ఏమీ తెలియదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు గవర్నర్ను కూడా అనుమతించడం లేదని పేర్కొన్నారు.
356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించండి
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో ఆయన క్షుణ్ణంగా వివరించారు. జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యులు నోరు ఎందుకు మెదపడం లేదని తెలుసుకోవాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, ముఖ్యమంత్రి ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి విధులు నిర్వర్తించే పరిస్థితిలో ఉన్నారో లేదో చెప్పాలని అన్నారు. మరోవైపు అమ్మకు సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు శనివారం ఉదయం అపోలో వైద్యులతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలకు అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నారు.
ప్రజా సంఘాల ఆందోళన
అమ్మకి ఏమైందో చెప్పాలంటూ ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జయలలిత ఆరోగ్యంపై ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో జయలలిత ఆరోగ్యంపై పుకార్లు ప్రచారం చేస్తున్నారంటూ ఒక ఎన్నారైతో పాటు పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ప్రచారాలతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. అమ్మ ఆరోగ్యంపై అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సెప్టెంబర్ 22న ఆపోలో చేరిన జయలలిత ఆరోగ్యానికి సంబంధించి, 24వ తేదీన కొన్ని రిపోర్టులు బయటకు వచ్చాయి.
జయను పరీక్షించేందుకు లండన్ నుంచి చెన్నైకి వచ్చిన డాక్టర్ రిచర్డ్
జయలలిత రిపోర్టులు బయటకు రావడంపై అపోలో ఆసుపత్రి వైద్యులు ఇద్దరు నర్సులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. శనివారం జయలలితను పరీక్షించేందుకు గాను విదేశీ వైద్యులు చెన్నైకి చేరుకున్నారు. లండన్కు చెందిన ప్రముఖ వైద్యుడు రిచర్డ్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
జయను పరామర్శించనున్న గవర్నర్ విద్యాసాగర్ రావు
లండన్లోని బ్రిడ్జి ఆసుపత్రికి చెందిన రిచర్డ్ జాన్ బీలే జయలలిత ఆరోగ్యాన్ని పరీక్షించనున్నారు. ఆపోలో ఆసుపత్రిలోని వైద్యుల బృందానికి మరో రెండు రోజుల పాటు ఆయన అందుబాటులో ఉంటారు. తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు జయలలిత ఆరోగ్యంపై స్పందించకపోవడంపై డీఎంకే అధినేత కరుణానిధి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.