మోడీ, బాబులకు కౌంటర్: జగన్, తెలంగాణ అస్త్రాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ విషయంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ బహుముఖ వ్యూహాలను అనుసరిస్తూ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి ప్రయోగించిన అస్త్రాలుగా భావిస్తున్నారు. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో పాగా వేయకుండా సోనియా తన వ్యూహాలను అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసే వ్యూహాలు కూడా అందులో ఉన్నట్లు చెబుతున్నారు.
జులై 30 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) చేసిన ప్రకటన పర్యసానంగా ఐదారు విధాలుగా లబ్ది చేకూరేలా పకడ్బందీ వ్యూహరచన చేసినట్టు సమాచారం. ప్రధానంగా కాంగ్రెస్ విభజన ప్రకటన వెనుక పెద్ద వ్యూహం కాంగ్రెస్లో వుందని సమాచారం. రాజకీయంగా బహుముఖమైన ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆరు సూత్రాల కాంగ్రెస్ మార్కు విభజన కార్యక్రమంలో ఎంతగానో ముందు చూపు వున్నట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడి ర్రాష్ట్రానికి వచ్చే సమయంలో విభజన ప్రకటన చేయడం మొదటి సూత్రంగా భావిస్తున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో మోడి ముద్ర పడకుండా చెక్ పెట్టడానికి విభజన ప్రకటన చేశారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రెండు ప్రాంతాలలో ప్రాబల్యం సంపాదించుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు ప్రాబల్యాన్ని సీమాంధ్ర ప్రాంతానికే పరిమితం చేయడం రెండవ సూత్రంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను మూడో అస్త్రంగా భావిస్తున్నారు. రెండు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి ఆ వాదాన్ని ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. విభజన ప్రకటన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర్రావును దగ్గర చేసుకోవడానికో, లేదంటే కెసిఆర్కు కార్యాచరణ లేకుండా చేయడానికో పనికి వస్తుందని భావిస్తున్నారు. కెసిఆర్ ప్రాబల్యాన్ని తగ్గించాలనే యోచన నాలుగవదిగా చెబుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితులలో కిరణ్ను సమైక్యవాద చాంపియన్గా గరిష్టస్థాయిలో పెంచడానికి తగిన అవకాశం కల్పించడం అయిదవ అంశంగా చెబుతున్నారు. ఫలితంగా సీమాంధ్రలో పార్టీ విజయావకాశాలను పెంపొందించాలనే యోచన ఉందని అంటున్నారు. భవిష్యత్తులో కిరణ్కుమార్ రెడ్డి గ్రూపు పార్టీ నుంచి విడిపోయినా సీమాంధ్ర లో జగన్కు చెక్ పెట్టి లబ్ది పొందాలనుకోవడం వ్యూహంలో భాగమేనని అంటున్నారు.
వైయస్ జగన్కు బెయిల్ రావడం సీమాంధ్రలో చంద్రబాబుకు చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదాన్ని పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా మార్చుకునే జగన్ వ్యూహం కారణంగా చంద్రబాబు దెబ్బ తినే ప్రమాదం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications