పవన్ ఇలా.. జనసేన గట్టెక్కేనా: దూరంపెట్టిన చిరు?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గట్టెక్కుతుందా? లేక తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలాగే ఫ్లాఫ్ షో అవుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని స్టార్ హోటల్లో పవన్ ప్రారంభించిన జనసేన రెండవ సమావేశం 27వ తేదీన విశాఖపట్నంలో జరుగుతుంది.
'యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్' నినాదంతో ఈ సమావేశాన్ని విశాఖలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు వారాల్లో పపన్ అహ్మదాబాదుకు వెళ్లి బిజెపి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీని కలిశారు. విశాఖలో 'ఇజం' అనే పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించనున్నారు.
కాంగ్రెస్ హటావో, దేశ్కీ బచావో అంటూ ఉప్పొంగే నినాదంతో, ఉద్వేగంతో కూడిన పిలుపుతో అభిమానుల్లోకి వచ్చిన పవన్ కీలకమైన సమయంలో ఇంత గ్యాపు ఇవ్వడం మంచిది కాదని పలువురు అంటున్నారు. పార్టీని ప్రకటించి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు జనసేన విధి విధానాలు, అనుసరించే ఎత్తుగడలపై సరైన వ్యూహం సరిగా లేదంటున్నారు.
తన పార్టీకి కర్త, కర్మ, క్రియ అంతా తానే ఉండి పవన్ నడిపిస్తున్నారు. రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? చేస్తే ఎన్ని స్ధానాల్లో పోటీ చేస్తుంది? పొత్తు ఉంటే ఎవరితో ఉంటుంది? రాజకీయంగా తన ప్రధాన శత్రువు ఎవరో స్పష్టం చేయాల్సి ఉంటుంది. పరోక్షంగా ఎన్నికల్లో జనసేన ప్రత్యర్థి ఎవరో తేలినప్పటికీ... ఇంకా టిడిపి, బిజెపిల విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
సీమాంధ్రలో బిజెపి, టిడిపి పొత్తుకంటే జనసేన గురించి ఎక్కువగా ఆశపెట్టుకోవడం విశేషం. శిశువులాంటి జనసేన పార్టీతో పొత్తు గురించి బిజెపి అర్రులు చాచడం, టిడిపితో పొత్తుల ప్రక్రియ కొనసాగకుండా తాత్సారం చేస్తోందనే విమర్శలు వినవస్తున్నాయి. మరోవైపు మెగా కుటుంబంలో చిచ్చు కొనసాగుతోంది.
పవన్ కళ్యాణ్ విశాఖలో మీటింగ్ పెట్టనున్న గురువారం రోజే ఇక్కడ రామ్ చరణ్ తేజ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్టీకి ముందే మెగా కుటుంబంలో ప్రజారాజ్యం విలీనం ద్వారా చిచ్చు రాజుకుంది. పవన్ జనసేనను స్థాపించడంతో అది ముదిరింది. ఇప్పుడు విశాఖ సభ రోజే రామ్ ఫ్యాన్సుతో మీటింగ్ పెట్టడం ద్వారా... చిరు కుటుంబం పవన్ను పక్కన పెట్టినట్లుగా అర్థమవుతోందంటున్నారు.