కిరణ్ టార్గెట్: వారు.. వీరు.. సీమాంధ్ర కాంగ్రెస్ కూడా!

పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కొండ్రు మురళీ, బాలరాజులు శనివారం భేటీ అయ్యారు. కిరణ్ వ్యాఖ్యల వల్ల ఆయన ఇమేజ్ పెంచాయని, పార్టీ గౌరవాన్ని మాత్రం పెంచేలే లేవని ఆవేదన వ్యక్తం చేశారట. ఆయన వైఖరి ఏకపక్షంగా ఉందని వారు అంతర్గత చర్చల్లో తప్పుపడుతున్నారు. సమైక్యం కోసం దేనికైనా రెడీ అని సిఎం చేసిన ప్రకటన పైన వారు చర్చించారట.
ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ ఇబ్బంది పడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. సిఎం అధిష్టానానికి చెప్పి మాట్లాడుతున్నారా లేక తెలియకుండా మాట్లాడుతున్నారా అనే సందేహాన్ని ఓ మంత్రి వ్యక్తం చేశారట. సిఎం ఇలా మాట్లాడుతూ సీమాంధ్రలో హీరో అవుతున్నారని పలువురు సీమాంధ్ర అసతృప్త నేతలు కూడా భావిస్తున్నారు. ఆయన వైఖరి ఏకపక్షంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
ఇక తెలంగాణ నేతలు కిరణ్ పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. "కిరణ్ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. దొంగచాటుగా ఢిల్లీలో పైరవీలు చేసుకున్నాడు. ఆయన ఉంటే ఎంత, పోతే ఎంత'' అని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు.
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కిరణ్ తప్పుపట్టడం, నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరడం బాధాకరమని సీనియర్ నేత, మంత్రి జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలనూ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
"నెహ్రూ, ఇందిరాగాంధీలు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగానే కలిసుండాలని చెప్పారు. అది సాధ్యం కానందునే మార్పు గురించి ఆలోచించాల్సి వచ్చింది. నాడు వారు చేసింది శిలాశాసనమే. సీఎం చేసే శాసనాన్ని కూడా మంత్రులుగా పాటిస్తాం. అయితే, ప్రజల సమస్యలపై అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి పనిచేద్దాం. సమస్యలు ఏవైనా ఉంటే... సీఎం, సీమాంధ్ర మంత్రులు ఎవరైనా సరే... వాటిని అధిష్ఠానానికి నివేదిద్దాం. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుందాం. అందరం కలిసి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ను కాపాడుదాం' అని సూచించారు.
అవగాహనతో విడిపోకపోతే ప్రమాదకర పరిస్థితులు వస్తాయన్నారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తే సమస్యలను పరిష్కరించాలని తాము కూడా సూచిస్తున్నామని జానారెడ్డి చెప్పారు. దిగ్విజయ్సింగ్ను తప్పుపట్టడం బాధాకరమని జానారెడ్డి పేర్కొన్నారు. దీనిపై విచారం వ్యక్తం చేశారు. "సీఎం వైఖరితో ఇక్కడి (తెలంగాణ) వారు కూడా రెట్టింపుగా పోరాడాలని భావించాలా? ఇక్కడి ప్రజలు రెచ్చిపోవాలా?'' అని ప్రశ్నించారు.
"తెలంగాణపై తీర్పు అయిపోయింది. సీమాంధ్ర ప్రాంత సమస్యలేమైనా ఉంటే చెప్పుకోవచ్చు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనమే. దీన్ని ఎవరు అధిగమించినా తీవ్రంగా ఖండిస్తాం'' అన్ని మంత్రి శ్రీధర్బాబు పరోక్షంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. "రాజకీయాల్లో రీమ్యాచ్లు ఉండవు. థర్డ్ అంపైర్ కూడా అవుట్ ఇచ్చిన తరువాత క్రీజ్లో నిలబడితే అర్థముండదు'' అని క్రికెట్ పరిభాషలోనే కిరణ్కు బదులిచ్చారు.
విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని మంత్రి డికె అరుణ పేర్కొన్నారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని తెలిపారు. "కాలానుగుణంగా రాజ్యాంగాన్ని, చట్టాలను మార్చుకుంటున్నాం. నచ్చకపోతే విడిపోవచ్చునని కూడా నెహ్రూ చెప్పారు. అది సీఎం మరిచిపోయారా? ప్రజల ఆకాంక్ష మేరకు, అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే.. నెహ్రూ కుటుంబానికి చెందిన సోనియా నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి'' అని అరుణ సూచించారు. అదే సమయంలో కిరణ్ ఇరు ప్రాంతాల తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా లక్ష్యంగా మారారు.












Click it and Unblock the Notifications