రంగంలోకి జానా: పీసీపీ పీఠం కోసం పోటాపోటీ, జానాకు ఉత్తమ్ చెక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవిని దక్కించుకొనేందుకుగాను సిఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి పావులు కదుపుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవిని దక్కించుకొనేందుకుగాను సిఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి పావులు కదుపుతున్నారు. అయితే సిఎల్పీ నాయకుడు జానాకు పీసీసీ పీఠం దక్కకుండా ఉండేందుకు గాను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. పిసీసీ పీఠం కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
తెలంగాణ పిసీసీ పీఠం కోసం పార్టీ సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా సిఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి పిసీసీ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. ఎన్నికల సమయంలో పిసీసీ పీఠంలో ఉన్న వారికి ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకొనేందుకుగాను జానా ఎత్తుగడలు వేస్తున్నారు. పార్టీని సమర్థవంతంగా నడిపించే శక్తి, సామర్థ్యాలు తనకు ఉన్న విషయాన్నిఆయన పార్టీ నాయకత్వానికి వివరించినట్టు సమాచారం.
పిసీసీ పీఠం కోసం జానా ఎత్తులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవిని దక్కించుకొనేందుకుగాను సిఎల్పీ నాయకుడు జానారెడ్డి వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలిసి తన మనోగతాన్ని వెల్లడించినట్టు సన్నిహితులు, ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు కూడ లేనందున పార్టీ నాయకత్వ స్థానంలో ఉంటేనే ప్రయోజనమని ఆయన భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి దక్కాలంటే పీసీసీ చీఫ్ పదవిలో ఉంటేనే ఎక్కువగా ప్రయోజం కలుగుతోందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.
ఉత్తమ్ వ్యూహాలిలా..
ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ పార్టీ పగ్గాలను వదులుకొనేందుకు సిద్దంగా లేరు. జానారెడ్డి ఎత్తులకు ఆయన పై ఎత్తులు వేస్తున్నారు.తన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్ళేలా ఉత్తమ్ వ్యూహరచన చేస్తున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతలు తెరవెనుక పోరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జానా వ్యూహలను పసిగట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ ప్రతి వ్యూహలను రచిస్తున్నారు. ఢిల్లీలో ప్రభావం చూపే నేతలతో ఉత్తమ్ వ్యక్తిగతంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
పిసీసీ చీఫ్ అయితేనే బెటర్
సిఎల్పీ నాయకుడి కంటే పీసీసీ చీఫ్ గా ఉంటేనే ప్రయోజనమనే అభిప్రాయంతో జానారెడ్డి ఉన్నాడని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీలోపార్టీ పెద్దలతో పలుమార్లు భేటీ అయ్యారని సమాచారం. మండలిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేతతో కలిసి ఆయన ఇప్పటికే అహ్మద్ పటేల్ , గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితరులతో జానా సమావేశమయ్యారని సమాచారం. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడ జానా రెడ్డి కలిశారని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని మంత్రి వదవులను చేసిన అనుభవం జానాకు ఉంది.ఒక్క ముఖ్యమంత్రి పదవి మాత్రమే ఆయన చేయలేదు. పార్టీ సారధ్య బాథ్యతలను తీసుకొంటేనే ప్రయోజనమనే అభిప్రాయంతో జానారెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
పార్టీపై పట్టుపెంచుకొనేందుకు ఉత్తమ్ వ్యూహాలు
పార్టీపై పట్టును పెంచుకొనేందుకుగాను ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహాలను రూపొందిస్తున్నారు. పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించకుండా ఆచితూచి అడుగులేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసేందుకుగాను ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలు పెరిగాయనే సంకేతాన్ని పీసీసీ చీఫ్ పార్టీ శ్రేణులకు ఇచ్చే పనిలో ఉన్నారు. అంతేకాదు పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.జానా కంటే ఉత్తమ్ ఈ రేసులో ముందున్నారు.
రాహుల్ స్పష్టత ఇచ్చారు
సంగారెడ్డి సభలోనే పీసీసీ చీఫ్ విషయమై ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టమైన ఆదేశాలిచ్చారని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఉత్తమ్ నాయకత్వంలోనే గ్రామాలకు వెళ్ళండంటూ ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టంగా దిశానిర్ధేశం చేసిన విషయాలను వారు గుర్తుచేస్తున్నారు. పార్టీకి, గాంధీ కుటుంబానికి ఉత్తమ్ ను అత్యంత విశ్వసనీయుడిగా భావిస్తున్నారని కొందరు పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో జానా ఎత్తుగడలు ఏ రకంగా ఫలిస్తాయో చూడాలి.