కెసిఆర్ ఆఫర్కు మోడీ నో: ఇక చంద్రబాబుకూ షాక్
హైదరాబాద్: ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ స్వతంత్రంగా ఎదిగే క్రమంలో బిజెపి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో కలిసి పనిచేయడానికి, పొత్తు పెట్టుకోవడానికి వచ్చిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోడీ తిరస్కరించినట్లు చెబుతున్నారు. కెసిఆర్ను కలుపుకోవాలని, అవసరమైతే టిఆర్ఎస్ను ప్రభుత్వంలో చేర్చుకోవాలని కెసిఆర్కు సన్నిహితులైన కొంత మంది బిజెపి నాయకులు ప్రధాని మోడీకి, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు చెప్పారని అంటున్నారు.
అయితే, టిఆర్ఎస్ ప్రతిపాదనలపై మోడీతో పాటు అమిత్ షా కూడా సానుకూలంగా ప్రతిస్పందించలేదని అంటున్నారు. ఒడిషాతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో స్వంతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఉన్నందువల్లనే వారు సానుకూలంగా ప్రతిస్పందించలేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం నుంచి కూడా బిజెపి త్వరలోనే బయపడుతుందని అంటున్నారు.
చంద్రబాబుతో తెగదెంపులు చేసుకుని వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా బలం పుంజుకోవాలని బిజెపి నాయకత్వం ఆలోచనగా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించవద్దని, కేంద్రంతో తగాదాకు దిగవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో సూచించినట్లు చెబుతున్నారు. అందుకు మోడీ టిఆర్ఎస్ ఎంపికి ధన్యవాదాలు చెప్పినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
ఆ పరిణామం తర్వాత బిజెపిలోని ఆయన మిత్రులు మోడీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ను చేర్చుకునే విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిడిపిని, కాంగ్రెసు పార్టీని అడ్డుకోవడం సాధ్యమవుతుంది గానీ బిజెపిని అడ్డుకోలేమనే అభిప్రాయానికి కెసిఆర్ వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే, బిజెపితో స్నేహానికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, మజ్లీస్తో కెసిఆర్ సన్నిహితంగా ఉంటున్నారు.
బిజెపితో స్నేహం చేస్తే మజ్లీస్ దూరం కావడమే కాకుండా ముస్లీం మైనారిటీలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారు. అసలు కెసిఆర్ అటువంటి ప్రతిపాదన చేశారా, బిజెపిలోని కెసిఆర్ మిత్రులు తమంత తామే మోడీ, అమిత్ షాల వద్ద ఆ ప్రతిపాదన పెట్టారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఇప్పటికిప్పుడు బిజెపితో గొడవ పడకూడదనే పద్ధతిలో కెసిఆర్ వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చేరడానికి అంత సుముఖంగా ఉండకపోవచ్చునని అంటున్నారు.