లగడపాటికి కెసిఆర్ షాక్: చంద్రబాబుతో భేటీ గుట్టు ఇదీ...
విద్యుత్తు కొనుగోలు విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ లగడపాటికి షాక్ ఇవ్వగా, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన ల్యాంకో పవర్ ప్రాజెక్టుతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ల్యాంకో పవర్ ప్రాజెక్టుతో ఒప్పందం చేసుకోవడానికి సానకూలంగా ప్రతిస్పందించినట్లు వార్తలు వచ్చాయి. దీని కోసమే లగడపాటి రాజగోపాల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసినట్లు సమాచారం.
ల్యాంకో పవర్ ప్రాజెక్టు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తు రేట్లు అధికంగా ఉండడం వల్ల, మార్కెట్లో అంతకన్నా తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులో ఉండడం వల్ల ల్యాంకోతో ఒప్పందం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేనట్లు సమాచారం.

పునరుద్ధరణకు నో...
ల్యాంకో పవర్ ప్రాజెక్టుతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది లగడపాటి రాజగోపాల్కు పెద్ద దెబ్బనే అవుతుందని భావిస్తున్నారు.

ఇలా అనుకున్నారు...
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీని మీడియాతో పాటు అంతా రాజకీయ కోణంలోనే చూశారు. దానిపై మీడియా పలు కథనాలు అల్లింది. రాష్ట్ర విభజన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని రాజగోపాల్ చెప్పారు. చంద్రబాబుతో భేటీ రాజకీయపరమైంది కాదని కూడా చెప్పారు. కానీ ఎందుకు కలిశారనేది మాత్రం స్పష్టం కాలేదు.

ఇప్పుడు స్పష్టత
ల్యాంకో పవర్ ప్రాజెక్టుతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని పునరుద్ధరింపజేసుకోవడానికి రాజగోపాల్ చంద్రబాబును కలిసినట్లు స్పష్టమైంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ధరకు మిగులు విద్యుత్తు ఉన్న పరిస్థితిలో ల్యాంకో నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న ఉదయిస్తోంది.

రాజకీయ కారణమేనా...
మార్కెట్లో తక్కువ ధరకు మిగులు విద్యుత్తు అందుబాటులో ఉన్న పరిస్థితిలో ఎక్కువ ధరకు ల్యాంకో నుంచి కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధపడడం వెనక రాజకీయ కారణాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయపరమైన ఆలోచనలతోనే లగడపాటి రాజగోపాల్ ప్రతిపాదనకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అధిక ధరల కారణంగా....
అధిక ధరల కారణంగా ల్యాంకో, జివికె, స్పెక్ట్రమ్ పవర్ ప్రాజెక్టులతో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను (పిపిఎలను) అప్రూవర్ చేయలేదని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో అధికారులు చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తలు వచ్చాయి. గ్యాస్ ఆధారిత ప్రాజెక్టుల విద్యుత్తుకు అధిక ధర ఉండడంతో తాము వాటిని ఆమోదించలేదని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు 1,100 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ల్యాంకోతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ పిపిఎ గడువు ముగిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పిపిఎను పునరుద్ధరించలేదు.












Click it and Unblock the Notifications