వణకుతున్న తెలంగాణ: చలిమంటకు బాలుడు బలి
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో చలికి ప్రజలు వణికిపోతున్నారు. చలి కారణంగా బుధ, గురువారాల్లో ఇద్దరు మరణించినట్లు వార్తలువచ్చాయి. చలికి తట్టుకోలేక వృద్ధుడి మరణించగా, చలి మంటలో పడి బాలుడు మరణించాడు.
శుక్ర, శనివారాల్లో కూడా వాతావరణం చలిగానే ఉంటుందని వాతావరణ శాఖ పరిశోధనా కార్యాయలయం అధికారులు అంటున్నారు. ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీల వరకు నమోదవుతాయని అంటున్నారు.
హైదరాబాదు సహా చలిగాలులు..
హైదరాబాద్ కూడా చలికి వణికిపోతోంది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చలి గాలులు విచే అవకాశం ఉంది. గురువారం ఆదిలాబాద్లో 4 డిగ్రీల సెల్సియస్, భద్రాచలం, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 9 డిగ్రీలు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
చలిగాలులతో వణికిపోతున్న ఆదిలాబాద్
ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలులతో ఆదిలాబాద్ జిల్లా తల్లడిల్లుతోంది. జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో 120 యేళ్ల చరిత్రలోనే అతి తక్కువగా బుధవారం 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం తెల్లవారు జామున 3.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఉష్ణోగ్రతలో రికార్డు బద్దలు..
ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.7 డిగ్రీలు నమోదైంది. గడచిన రెండు రోజుల్లోనే ఈ రికార్డులను పటాపంచలు చేస్తూ 3.0, 3.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలలో మంచు గడ్డకట్టే రీతిలో చలి తీవ్రత పెరిగి పోతోందని వాతావరణ నిపుణులు అంటున్నారు. సముద్ర మట్టానికి 350 మీటర్ల ఎత్తులో ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా విస్తరించి ఉండడం వల్లనే కాకుడా చుట్టూ నదీ జల ప్రవాహాలు, దట్టమైన అడవులు చలి తీవ్రతకు కారణమని అంటున్నారు.
చలి మంటకు చిన్నారి బల
చలిమంట కాచుకుంటున్న సమయంలో ఓ బాలుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో జరిగింది. గ్రామానికి చెందిన మంగళారపు రామక్రిష్ణ, శాలినిల కుమారుడు సాయిచరణ్ (6) యూకేజీ చదువుతున్నాడు. బుధవారం బడికి సెలవు కావడంతో పిల్లలను ఇళ్లలోనే ఉంచి పెద్దలు పొలాలకు వెళ్లారు.
ఇలా మంటలు అంటుకున్నాయి..
మధ్యాహ్నం సాయిచరణ్, అతడితోపాటే చదువుకునే బండారి వంశీలు చలి కాచుకునేందుకు మొక్కజొన్న బెండ్లు వేసి కిరోసిన్ పోసి నిప్పు పెడుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి శరీరానికి అంటుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను హైదరాబాద్ తరలించగా అర్ధరాత్రి సమయంలో సాయి చరణ్ మృతి చెందాడు.
వదిలేయడంతో వృద్ధుడు ఇలా..
పిల్లలు పట్టించుకోకపోవడంతో వీధన పడిన ఓ వృద్ధుడు చలికి బలయ్యాడు. ఈ సంఘటన సిద్దిపేట రూరల్ మండలంలోని బండచెర్లపల్లిలో గురువారం జరిగింది. పిల్లలు పట్టించుకోకపోవడంతో రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన పోతరాజు రామయ్య (80) బిక్షమెత్తుకుంటూ జీవిస్తూ వచ్చాడు. వారం కిందట ఒకప్పటి స్వగ్రామమైన బండచెర్లపల్లికి వచ్చి బస్ షెల్టర్లో ఉంటూ వస్తున్నాడు. చలికి తట్టుకోలేక అతను మరణించాడు.