చంద్రబాబుపై టీ టిడిపి అసంతృప్తి: లోకేష్కు మొర
హైదరాబాద్: తెలంగాణ విషయంలో పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరి అర్థం కాక తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు గందరగోళంలో పడుతున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు వైఖరి, అనుసరిస్తున్న విధానాలు గొడ్డలి పెట్టుగా మారాయనే మాట కూడా వినిపిస్తోంది. ఎమ్మల్సీ ఎన్నికల్లో చంద్రబాబు వైఖరితో ఆ పార్టీ తెలంగాణ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు వైఖరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తెలంగాణ టిడిపి నాయకులు చంద్రబాబు తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్ద మొర పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును స్వయంగా ఆహ్వానించడం దగ్గరి నుంచి మైహోం అధినేత రామేశ్వరరావుతో భేటీ వరకు చంద్రబాబు వైఖరి వల్ల పార్టీకి తెలంగాణలో నష్టం జరుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో 12 స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చంద్రబాబు అంటీముట్టనట్లు వ్యవహరించడాన్ని బట్టి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో కూడా అలాగే వ్యవహరిస్తారేమననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మెట్రో రైలుకు కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా మై హోం అధినేత రామేశ్వర రావుకు కట్టబెట్టిందని తెలంగాణ నాయకుడు రేవంత్ రెడ్డి వంటి వారు పోరాటం చేస్తూ వచ్చారు. ఈ స్థితిలో చంద్రబాబు రామేశ్వర రావును కలవడం వెనక ఉన్న మతలబు ఏమిటనేది తెలియకపోయినప్పటికీ ఆ భేటీ పార్టీకి మాత్రం నష్టం చేస్తుందని అంటున్నారు.
మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత కష్టపడితే పార్టీ విజయం సాధించే అవకాశాలున్నాయని చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదని అంటున్నారు. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో టిఆర్ఎస్ను దెబ్బ తీయబోయి రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత ఆ పరిస్థితిని మళ్లీ తెచ్చుకోవద్దనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉండి ఉంటారని అంటున్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేయాలని తెలంగాణ టిడిపి నాయకులు చేసిన విజ్ఞప్తిని కూడా చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. తమ పార్టీకి పట్టు ఉన్న హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు ఈ విధమైన నిర్లిప్త వైఖరి ప్రదర్శించడం పార్టీ నాయకులకు నచ్చడం లేదని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు తెలంగాణలో పార్టీపై అశలు వదులుకున్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications