బాబు సంకేతాలు: టిడిపి పగ్గాలు లోకేష్ చేతికి..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పగ్గాలను తన కుమారుడు నారా లోకేష్కు ఇచ్చేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే మహానాడులో ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి, పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
అదికారులతో జరుపుతున్న సమీక్షా సమావేశాల్లోనూ, రోజువారీగా నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాల్లోనూ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పేరును ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆధార్ కార్డులపై, రైతుల రుణమాఫీపై, తదితర కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించిన సమయాల్లో చంద్రబాబు పదే పదే తన కుమారుడి పేరును ప్రస్తావనకు తెచ్చినట్లు చెబుతున్నారు.
తన కుమారుడు కేవలం వారం రోజుల్లో 50 లక్షల సభ్యత్వం చేయించారని చంద్రబాబు ఓ సమావేశంలో ప్రశంసించారని చెబుతున్నారు. ఒక్క తప్పు కూడా లేకుండా పేర్లను కంప్యూటరైజ్ చేశాడని కూడా చెప్పాడని అంటున్నారు. తన కుమారుడు అంత పనిచేస్తున్నప్పుడు అధికారులు అన్ని సౌకర్యాలు ఉండి కూడా తగిన విధంగా ఎందుకు పనిచేయడం లేదని ఆయన నిలదీస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే నారా లోకేష్ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తూ నాయకులను, కార్యకర్తలను కూడగట్టే పనిచేస్తున్నారు. క్రమంగా ఆయన పార్టీ పగ్గాలను చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకోవడమే కాకుండా చంద్రబాబు కూడా అందుకు తగిన సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.