'క్లినికల్ ట్రయల్స్' మృత్యు ఘంటికలు: కొత్తపల్లినే ఎందుకు టార్గెట్ చేశారు?, అసలేం జరుగుతోంది..
కరీంనగర్: క్లినికల్ ప్రయోగాల రూపంలో పేదరికంపై ఇప్పుడు మరో దాడి జరుగుతోంది. డబ్బు ఆశ చూపించి జీవితాన్నే పణంగా పెట్టే దుస్థితిని కల్పిస్తోంది. మెడికల్ ల్యాబ్లకు పేదరికం ఇప్పుడో ముడి సరుకుగా మారిపోయిందనడానికి కరీంనగర్ కొత్తపల్లిలో వెలుగుచూసిన ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు.
ఔషధ కంపెనీల బరితెగింపుకు కొత్తపల్లికి చెందిన అమాయక యువకులు బలైపోతున్నారు. జంతువులపై జరపాల్సిన క్లినికల్ ట్రయల్స్ ను మనుషుల పైనే ప్రయోగిస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారించాల్సిన విషయం.
బలైపోతున్న యువకులు:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన బోగ మార్కండేయ, స్వరాజ్యం దంపతుల రెండో కుమారుడు సురేశ్. 8 ఏళ్ల క్రితమే భర్త మరణించడంతో బీడీలు చేస్తూ తల్లి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. సురేశ్ హైదరాబాద్ లో క్యాటరింగ్ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.
ఇటీవల కిషన్ అనే కరీంనగర్ కు చెందిన వ్యక్తితో సురేశ్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే అతని జీవితాన్ని చిధిమేసేలా తయారైంది. క్లినికల్ ప్రయోగాలకు అంగీకరిస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో.. సురేశ్ ఒప్పుకుననాడు. 2015నుంచి ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు పట్టణాల్లో సుమారు 15సార్లు ఔషధ ప్రయోగాల్లో పాల్గొన్నాడు.
మంత్రి ఈటెల భరోసా:
ఈ ఏడాది జులైలో బెంగళూరులోని అపోటెక్స్ కంపెనీలో మత్తుకు సంబంధించిన ప్రయోగాల్లోను పాల్గొన్నాడు. ఇందుకు గాను సంస్థ నుంచి రూ.8,795లను చెక్కు రూపంలో పొందాడు. అయితే ప్రయోగాల దుష్ఫలితంతో గత రెండు నెలలుగా సురేశ్ ఆరోగ్యం క్షీణించింది.
శనివారం రాత్రి బైక్ పై వెళ్తుండగా.. ఒక్కసారిగా రక్తపు వాంతులు మొదలయ్యాయి. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్లినికల్ ప్రయోగాల దుష్ఫలితాల కారణంగా 5 నెలల క్రితం నాగరాజు అనే యువకుడు లోటస్ ఫార్మా క్లినికల్ ట్రయల్స్కు బలయ్యాడు. ఇటీవల అశోక్ కుమార్ అనే మరో యువకుడు మతి స్థిమితం కోల్పోవడం గమనార్హం.
ఔషధ ప్రయోగంతో మతిస్థిమితం కోల్పోయిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన అశోక్కుమార్కు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ఔషధ ప్రయోగంతో తన కొడుకు మతిస్థిమితం కోల్పోయాడని తల్లి కమల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ బావ్సింగ్ అశోక్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. మంత్రి ఈటల తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడి అశోక్కు మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలోని నిమ్స్ కు తరలించాలని ఆదేశించారు. మరోవైపు అశోక్ను మొదట స్థానిక వైద్యుల వద్ద పరీక్షించి పరిస్థితిని బట్టి కోర్టు ద్వారా ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.
నిబంధనలు లెక్క చేయరా?:
దేశవ్యాప్తంగా 96వేల ఔషధ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 84 ఔషధ ప్రయోగ కేంద్రాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో-24, గుజరాత్-18, తెలంగాణ-9 క్లినికల్ ట్రయల్స్ కేంద్రాలున్నాయి. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ నుంచి వీటికి అనుమతులున్నాయి. అయితే ఈ కేంద్రాలు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీఐజీ), డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(డీసీవో) నిబంధనలను పాటించడం లేదు.
ఔషధ కేంద్రాలలో ఔషధ పరిణమాణం, తీవ్రత, సాంద్రత తదితర అంశాలపై ప్రయోగాలు జరుపుతారు. ఇలా ప్రాథమికంగా సిద్దం చేసిన ఔషధాన్ని రెండో దశలో జంతువులపై ప్రయోగిస్తారు. అవి మంచి ఫలితాలనిస్తే.. ఆపై మూడో దశలో మనుషులపై ప్రయోగం జరుపుతారు. కానీ ఔషధ ప్రయోగ కేంద్రాలు మాత్రం నేరుగా మనుషుల పైనే ప్రయోగాలు జరుపుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏజెంట్ల సహాయంతో:
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కేంద్రాలుగా పనిచేస్తున్న కొన్ని ఫార్మా కంపెనీలు హుజూరాబాద్లో ఏజెంట్లను నియమించుకున్నాయి. వీరు పేదలు, నిరుద్యోగులను మాయమాటతో నమ్మించి బుట్టలో వేసుకుంటున్నారు. ఔషధ ప్రయోగాలకు ఒప్పిస్తూ, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
అంగీకరించిన వారిని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తీసుకెళ్లి మూడు, నాలుగు వారాల పాటు అక్కడే ఉంచుతూ, ఫార్మా కంపెనీతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే విధంగా చేస్తున్నారు. ఔషధ కంపెనీల ప్రయోగాలకు ఒప్పుకున్న వారి చేతిలో అంతో ఇంతో పెట్టి సరిపెట్టుకుంటున్న ఏజెంట్లు... ఫార్మా సంస్థల నుంచి లక్షలు తీసుకుంటున్నారు. ప్రయోగాలు వికటించినప్పుడు తమకేమీ సంబంధంలేదన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
కొత్తపల్లిలోనే ఎందుకు?:
జమ్మికుంట పట్టణానికి ఆనుకుని ఉన్న కొత్తపల్లి పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇతర ప్రాంతాల నుంచి జమ్మికుంట పట్టణానికి వలస వచ్చే పేదలు కొత్తపల్లిలోనే నివసిస్తుంటారు. దీంతో ఎవరు కొత్తవారో, ఎవరు పాతవారో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇదే ఆసరాగా చేసుకుని పలు ఔషధ కంపెనీల ఏజెంట్లు.. కొత్తపల్లికి చెందిన పేదలకు ఎరవేస్తున్నారు. ఈ క్రమంలోనే అశోక్కుమార్, సురేశ్తో పాటు మరికొందరు ఔషధ ప్రయోగాల బారిన పడ్డారని తెలుస్తోంది.
నాగరాజు మృతితో వెలుగులోకి:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ పరిధి నాగంపేటలో వంగర నాగరాజు మృతితో ఔషధ ప్రయోగ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నాగరాజు రెండో కొడుకుకు గతంలో మెడికల్ దు కాణంలో పనిచేసిన అనుభవం ఉన్నది.
ప్రస్తుతం హైదరాబాద్లో మార్కెట్లో పనిచేస్తున్నా డు. తండ్రి చనిపోవడంతో స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు, తన తండ్రి బ్యాగులు సర్దుతుండగా అందులో ఓ ఔషధ కంపనీకి చెందిన ఐసీఎఫ్(ఒప్పంద పత్రం)ను గమనించాడు. పత్రంపై ఉన్న నంబర్స్ ఆధారంగా సంప్రదిస్తే అది బెంగళూరు కంపెనీ అని తెలిసింది. ఈ నెల 12న అక్కడికి వెళ్లగా.. బౌన్సర్లతో తమను బెదిరింపులకు గురిచేసినట్లు చెప్పారు.