బాబు 'పెట్టుబడులు': నిష్టూరపోయే నిజాలు.. బయటపెట్టిన కేంద్రమంత్రి
వాస్తవాలను వక్రీకరించి.. ప్రతికూలతను కూడా తమ అనుకూలంగా చూపించుకుంటున్న వైనంపై అసలు నిజాలను సోషల్ మీడియా బయటపెడుతోంది.
న్యూఢిల్లీ/విజయవాడ: అనుకూల మీడియా చేతిలో ఉంటే తిమ్మిని బమ్మి చేయవచ్చన్న సంగతి మరోసారి రుజువైంది. ఎంతటి నెగటివ్ వార్తనైనా అనుకూలంగా మార్చేసి జనాన్ని మభ్యపెట్టగల దినపత్రికలు.. ఇంకా టీడీపీకి కొమ్ముకాస్తున్నాయన్న విమర్శకు మరో ఆధారం దొరికింది.
పెట్టుబడుల లెక్కల్లో ఏపీ ప్రజలను ప్రభుత్వం ఎంత అమాయకులుగా భావిస్తుందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తమ అనుకూల వర్గాలు చెప్పిన లెక్కల్నే జనం గుడ్డిగా విశ్వసిస్తారనుకున్న టీడీపీకి సోషల్ మీడియా ఒక చెంప పెట్టులా తయారైంది. వాస్తవాలను వక్రీకరించి.. ప్రతికూలతను కూడా తమ అనుకూలంగా చూపించుకుంటున్న వైనంపై అసలు నిజాలను సోషల్ మీడియా బయటపెడుతోంది.
రాజస్యభలో బట్టబయలు:
ప్రధాని తరహాలో విదేశీ పర్యటనలు.. రెండు పెట్టుబడుల సమ్మిట్ లు.. 15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఊకదంపుడు ప్రచారాలు.. ప్రచారం ఘనంగానే ఉంది కానీ నిజమే నిష్టూరంగా ఉందన్న సంగతి తేలిపోయింది.
రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మేఘ్ వాల్ ఇచ్చిన సమాధానాలే ఇందుకు నిదర్శనం. ఏపీలో రూ.15లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరిగితే.. అందులో డీపీఆర్(డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు)లు లేని ప్రాజెక్టులే ఎక్కువ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఎలాంటి పురోగతి లేని కొన్ని ఒప్పందాలు కూడా రద్దయిపోయాయని తెలిపారు.
ప్రభుత్వ ప్రచారానికి.. వాస్తవానికి తేడా?:
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన రెండు భాగస్వామ్య సదస్సుల్లో కలిపి మొత్తం 1629ప్రాజెక్టుల ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని కేంద్రమంత్రి అన్నారు. అయితే వీటిలో అత్యధిక ఎంవోయూలకు డీపీఆర్(డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు)లు లేవని కూడా చెప్పారు.
2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.4,78,788కోట్లకు సంబంధించిన పెట్టుబడుల్లో.. 331ఎంవోయూలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసిందన్నారు. వీటిలో రూ.2,83,943కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 99ఎంవోయూలపై ఇంతవరకు డీపీఆర్ లు సమర్పించలేదన్నారు.అలాగే 31,000కోట్ల పెట్టుబడుల అంచనాలతో 6ఒప్పందాలు రద్దయ్యాయని కూడా తెలిపారు.
ఇక 2017లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.10,54.,431కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వివిధ సంస్థలతో 665ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. వాటిలో రూ.6,33,892కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 335ఓంవోయూలపై డీపీఆర్ లు సమర్పించలేదని వెల్లడించారు. వీటితో పాటు 1,75,000కోట్లతో కుదుర్చుకున్న మరో 12ఒప్పందాలు కూడా రద్దయ్యాయని అన్నారు. మిగిలిన ఎంవోయూలు వివిధ దశలల్లో ఉన్నాయన్నారు.
దీన్ని కూడా అనుకూలంగా మలిచేసి:
ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలకు సంబంధించి చాలావరకు ఒప్పందాలకు అసలు డీపీఆర్ లు లేవని, మరికొన్ని రద్దయిపోయానని ఓవైపు కేంద్రమంత్రి స్పష్టంగా చెబుతుంటే.. టీడీపీ అనుకూల మీడియా మాత్రం దాన్ని కవర్ చేయలేదు. రద్దయిపోయిన, డీపీఆర్ లు లేని ఎంవోయూల గురించి ప్రస్తావించకుండా.. ఏపీకి రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ భ్రమ కల్పించేలా టీడీపీ అనుకూల పత్రిక కథనాన్ని సిద్దం చేసింది. ప్రాజెక్టులు పెట్టుబడుల వివరాలు తప్పితే.. కేంద్రమంత్రి చెప్పిన వాస్తవాలు అందులో ఎక్కడా కనిపించలేదు.
ఇక మరో పత్రిక తీరు ఇలా:
ఏపీ భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన వార్తకు సదరు టీడీపీ అనుకూల పత్రిక ఎక్కడో మూలన చిన్న స్పేస్ కేటాయించింది. అది కూడా కనీ కనిపించకుండా. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చే వార్తలు అంతగా ఫోకస్ కాకుండా వీళ్లెంత జాగ్రత్తపడుతున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే సదరు పత్రిక వెల్లడించిన వివరాలను గమనిస్తే.. 2016-17పెట్టుబడుల సదస్సుల్లో రూ.15.31లక్షల కోట్ల విలువైన 996ఒప్పందాలు జరిగినట్లు కేంద్రమంత్రి ఇచ్చిన వివరణగా పేర్కొంది. వీటిలో రూ.4.09కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టు పనులు ప్రారంభమవగా.. రూ.9.17లక్షల కోట్ల పెట్టుబడులకు డీపీఆర్ లు సిద్దమవుతున్నట్లుగా తెలిపింది.
ఎక్కడ రూ.15లక్షల కోట్లు.. ఎక్కడ రూ.4కోట్లు?.. ఇంత అగాథాన్ని బయటకు కనిపించకుండా టీడీపీపై మచ్చ పడకుండా ఆ పత్రికలు భలే మేనేజ్ చేశాయని చెప్పుకుంటున్నారు.
పెట్టుబడుల్లో నిజమెంత?:
ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం.. దానికి సంబంధించి ఓ శ్వేతపత్రమైనా విడుదల చేయవచ్చు కదా!.. ఈ మూడేళ్లలో వారు సాధించిన పెట్టుబడుల లెక్కలు.. అవి ఏయే దశలల్లో ఉన్నాయో తెలిపేలా జనం ముందు దాన్ని పెట్టవచ్చు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి చంద్రబాబు నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో ఫేక్ పర్సనాలిటీలు దర్శనమిచ్చారన్న అపవాదు ఉంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం అప్పట్లో దీన్ని బట్టబయలు చేసింది. ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి.. వీళ్లే భవిష్యత్తులో మన వద్ద కంపెనీలు పెట్టబోతున్నారు.. ఉద్యోగాలు ఇవ్వబోతున్నారంటూ.. హడావుడి చేసిందన్న ఆరోపణలున్నాయి.
దొడ్డల శ్రీధర్ అనే ఓ పీర్వో కూడా ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు వార్తలు రావడంతో.. వైసీపీ శ్రేణులు ఆయన వివరాలన్ని లాగి జనం ముందు పెట్టారు. ఓ సాదాసీదా పీఆర్వోకు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేంత డబ్బు ఎక్కడిది?.. ఇదంతా వంటి హంబక్ అని ప్రత్యర్థి పార్టీ విమర్శించింది.రాజ్యసభలో కేంద్రమంత్రి వివరించిన లెక్కలను బట్టి చూస్తే.. టీడీపీ పెట్టుబడుల మాయ మరోసారి బహిర్గతమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా జనాన్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నాలకు బదులు.. చిత్తశుద్దితో పనిచేస్తేనే ఏ ప్రభుత్వానికైనా మనుగడ అనేది ఏపీ ప్రభుత్వం గుర్తించాలేమో అంటున్నారు పరిశీలకులు.