హిస్టరీ మళ్లీ మొదటికే: ఎయిర్ ఇండియాపై ‘టాటా’ల కన్ను
స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్ల వరకు పౌర విమాన యాన రంగంలో సేవలందించిన ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ ‘టాటాసన్స్’ మరోసారి పూర్తిస్థాయిలో ఆ పని చేసేందుకు సమాయత్తం అవుతోంది.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్ల వరకు పౌర విమాన యాన రంగంలో సేవలందించిన ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ 'టాటాసన్స్' మరోసారి పూర్తిస్థాయిలో ఆ పని చేసేందుకు సమాయత్తం అవుతోంది. 1953 వరకు టాటాల ఆధీనంలో ఉన్న 'టాటా ఎయిర్ లైన్స్' సంస్థను నాటి ప్రధాని పండిట్ నెహ్రూ జాతీయం చేశారు.
నాడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేందుకు నెహ్రూ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఈ నాడు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ యుగంలో ప్రభుత్వ రంగ సంస్థలకు లాభ నష్టాలు పేరిట 'ఎయిర్ ఇండియా'ను ప్రైవేట్ సంస్థలకు అమ్మివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసుకునే విషయమై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాటా సన్స్ ఎమిరస్ చైర్మన్ రతన్ టాటా, చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆసక్తి కనబరిచినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వంతో వారు చర్చించారని తెలుస్తున్నది.
తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న 'ఎయిర్ ఇండియా'లో మెజార్టీ వాటాలను తీసుకునేందుకు టాటా గ్రూప్ ఆసక్తితో ఉన్నట్టుగా వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిజంగానే టాటాలు ఎయిర్ ఇండియాలో మెజార్టీ వాటాలు తీసుకుంటే, కోల్పోయిన తమ పునర్వైభవ చిహ్నాన్ని మళ్లీ సొంతం చేసుకున్నట్లే అవుతుంది.
1953లో ఇలా ఎయిర్ ఇండియాగా జాతీయం
దేశంలో పౌర విమానయాన పరిశ్రమకు నాంది పలికింది టాటా సన్స్ గ్రూపే. ఆ సంస్థే నిర్మించి అద్భుతంగా నిర్వహించిన సంస్థనే ప్రభుత్వం సొంతం చేసుకుని కొన్ని దశాబ్దాలపాటు నడిపింది. తప్పుడు నిర్ణయాలతో నష్టాలపాలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు అమ్మకానికి పెట్టింది. అమ్మితే కొనేవారు కూడా దిక్కులేని సంస్థ అంటూ స్వయంగా మంత్రులే ఈసడిస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియాను అప్పనంగా ఎవరికో కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేహాలు పౌర విమాన యాన పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీన మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా విక్రయానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు. ఏదో ఒక మార్గంలో ఎయిర్ ఇండియాకు ప్రైవేటీకరించేందుకు గల మార్గాలను అన్వేషిస్తున్నామని మాత్రం తేల్చేశారు.
అధికార యంత్రాంగంలో అవినీతిపై రతన్ టాటా ఇలా
ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఆసక్తి చూపిస్తోందన్న వార్తలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. సాల్ట్ నుంచి ఐరన్ వరకు అన్ని రకాల వస్తువులకు చెందిన వందకుపైగా కంపెనీలతో బహుముఖాలుగా విస్తరించిన టాటాలు విమానయాన రంగాన్ని ప్రైవేటీకరించిన తర్వాత కూడా చాలా ఏండ్ల తరబడి మళ్లీ అడుగుపెట్టలేదు. అడుగుపెట్టే ప్రయత్నం చేసినా, అవినీతిమయమైన అధికార యంత్రాంగం కారణంగా ఎదురైన చేదు అనుభవాలతో వెనక్కి తగ్గినట్టు రతన్ టాటా పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా ప్రభుత్వం విక్రయానికి ప్రక్రియ ప్రారంభిస్తే టాటా సన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ మార్గదర్శకాలు, సూచనలు అందజేసినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే టాటా సన్స్ గ్రూప్ రెండు, మూడేళ్లుగా మలేసియా ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యంలో ఎయిర్ ఆసియా, విస్తారా పేరుతో ఎయిర్లైన్స్ సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంటే చరిత్ర వృత్తాన్ని టాటా గ్రూప్ పూర్తి చేసినట్లే అవుతుంది. అయితే టాటా సన్స్ అధికార ప్రతినిధి గానీ, సింగపూర్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి గానీ దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.
పూర్తి స్థాయి విక్రయానికి సివిల్ ఏవియేషన్ నో
ఎయిరిండియాలోని కంట్రోలింగ్ స్టాక్ 51 శాతం ఈక్విటీ హోల్డింగ్ ను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిపింది. ఈ విమానయాన సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించాలనే నీతిఆయోగ్ ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ దిశగా ముందుకు కదులుతోంది. కానీ ఎయిరిండియాను పూర్తిగా ప్రైవేటీకరించకుండా, కొంత మేర షేర్లను ప్రభుత్వం వద్ద ఉంచుకోవాలని ఏవియేషన్ మంత్రిత్వశాఖ సూచిస్తోంది. ఎయిర్ ఇండియా వాటా అమ్మకం ప్రభావం సంస్థ ఉద్యోగులపై భారీగా పడనున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఆ మంత్రిత్వశాఖ మంత్రి భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మక ప్రక్రియకు మరి కొంతకాలం సమయం పట్టేలా కూడా కనిపిస్తున్నది.
1932లో టాటా ఎయిర్ లైన్స్ ప్రారంభం ఇలా
1932లో టాటా ఎయిర్లైన్స్ ప్రారంభమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా తొలి విమానాన్ని తానే స్వయంగా కరాచి, ముంబై మధ్య నడిపారు. 1946లో టాటా ఎయిర్లైన్స్ను ఎయిర్ ఇండియా పేరుతో పబ్లిక్ కంపెనీగా మార్చారు. జేఆర్డీ టాటా కలల పుత్రికగా చెప్పే ఎయిర్ ఇండియా.. టాటాల నిర్వహణలో ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్లైన్స్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నది. నిర్వహణలో ప్రతి చిన్న అంశంలోనూ, ప్రయాణికులకు అందించే ఆహార పదార్ధాల నుంచి కర్టెన్ల ఎంపిక వరకు జేఆర్డీ కలుగజేసుకునేవారని ప్రతీతి. 1953లో ప్రభుత్వం దీనిని జాతీయం చేయడంతో జేఆర్డీ కలలు కుప్పకూలాయి. కనీసం తమతో మాట కూడా చెప్పకుండా ప్రభుత్వం ఎయిర్ ఇండియాను జాతీయం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నాటి ప్రధాని నెహ్రూకు జేఆర్డీ లేఖ కూడా రాశారు. నిర్ణయం కంటే కూడా నిర్ణయం తీసుకున్న పద్ధతి తనను బాధించిందని ఆయన పేర్కొన్నారు. సంస్థను జాతీయం చేసినా చైర్మన్గా మాత్రం జెఆర్డినే కొనసాగాలని నెహ్రూ నిర్ణయించడంతో 1977 వరకు ఆయనే చైర్మన్గా ఉన్నారు. 1977లో మొరార్జీ ప్రభుత్వం ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తప్పించింది.
ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ వాటాపైనే టాటాల కన్ను
ఇప్పటివరకూ ఎయిరిండియాకు రూ.30 వేల కోట్ల మేర సహాయ ప్యాకేజీలను కేంద్రం ప్రకటించింది. ఇందులో దాదాపు రూ. 24,000 కోట్లు కంపెనీ అందుకుంది కూడా. అయినా పనితీరును మెరుగుపరుచుకోవడంలో దారుణంగా విఫలమైంది. గాడిలో పడకపోగా మరింత రుణాల ఊబిలోకి జారిపోయింది. మార్కెట్ వాటా కోల్పోతూనే వస్తోంది. భారీగా రుణాలున్నా.. ఇప్పటికీ ఎయిరిండియాకు ఉన్న 14 శాతం దేశీ మార్కెట్ వాటా టాటాలను ఊరిస్తోంది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ ఎయిర్ట్రాఫిక్కు సంబంధించి 17% వాటా ఎయిరిండియా గుప్పిట్లో ఉంది. ఇది కూడా టాటా గ్రూప్ను కొనుగోలుపై దృష్టిసారించేలా చేస్తోంది. కాగా, సంస్థ రుణ భారాన్ని భారీగా తగ్గించే విషయంలో ప్రభుత్వం టాటాలకు హామీనిచ్చిందని.. అందుకే వారు ఈ డీల్కు ఆసక్తిని కనబరుస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటికే సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వామ్యంతో ప్రీమియం ఎయిర్లైన్స్ ‘విస్తార'ను టాటా గ్రూప్ నడుపుతోంది. అదేవిధంగా మలేసియాకు చెందిన ఎయిర్ఏషియాతో జట్టుకట్టడంద్వారా చౌక ధరల ఎయిర్లైన్స్ ఎయిర్ఏషియా ఇండియాను కూడా ప్రారంభించింది. ఈ ఎయిర్లైన్స్ ద్వారానే టాటాలు మళ్లీ విమానయాన రంగంలోకి అడుగుపెట్టారు కూడా. ఇప్పుడు ఎయిరిండియాను కూడా చేజిక్కించుకుంటే.. మార్కెట్ వాటాను గణనీయంగా దక్కించుకోవచ్చనేది టాటా గ్రూప్ వ్యూహం.
సింగపూర్ ఎయిర్ లైన్స్ నెట్ వర్క్ ఇలా విస్తరణ
జాతీయ ఎయిర్ లైన్స్ ‘ఎయిర్ ఇండియా'ను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ ఆసక్తి చూపడానికి మూడు కారణాలు ఉన్నాయి. పౌర విమాన యాన రంగంలో పెట్టుబడులకు రతన్ టాటా ఆసక్తి కలిగి ఉన్నారు. రకరకాల కార్లంటే రతన్ టాటాకు ఎంతిష్టమో అందరికీ తెలిసిన విషయమే. విస్తారా వచ్చే ఏడాది అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలని కలలు కంటున్నది. ఎయిర్ ఇండియా విమానాల్లో 118 సీట్లు ఉన్నాయి. ఎయిర్ ఇండియాకు ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్క్ ఉన్నది. దీనివల్ల సింగపూర్ ఎయిర్లైన్స్ నెట్ వర్క్ విస్తరిస్తుంది. తద్వారా థాయి ఎయిర్ వేస్, కథాయ్ పసిఫిక్ అండ్ ఎమిరేట్స్ వంటి సంస్థలపై ఒత్తిడి పెరుగుతుంది.