నెట్స్లో ప్రాక్టీస్: 3ఏళ్లుగా వికెట్ కీపింగ్ చేయని ధోని
మెల్బోర్న్: అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. టీమిండియా జట్టులో తక్కువ ప్రాక్టీస్ చేసి ఎక్కువ విజయాలను అందించిన కెప్టెన్గా ధోనిని మాజీ క్రికెటర్లు కొనియాడుతుంటారు. గత మూడు సంవత్సరాలుగా టీమిండియా కెప్టెన్ ధోని నెట్స్లో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం లేదంటే నమ్మండి.
ఈ విషయాన్ని స్వయంగా ధోని సహచరులే వెల్లడించారు. నెట్స్లో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ తప్ప, కీపింగ్ ప్రాక్టీస్ను ఎప్పుడో వదిలేశాడని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొన్ని వందల మ్యాచ్లకు కీపింగ్ చేస్తున్న ధోని ప్రత్యేకించి నెట్స్లో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు.
కెప్టెన్ ధోని అభిప్రాయం కూడా ఇదేనని తెలుస్తోంది. అయితే మ్యాచ్ రోజు మాత్రం ముందు పది బంతులు వేయించుకుని క్యాచ్లు పడతాడని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఇంతకు మించి ధోని ఎలాంటి సాధన చేయక పోవడం విశేషం.
కానీ, గతంలో టీమిండియాకు వికెట్ కీపర్గా పని చేసిన సయ్యద్ కిర్మాణి, కిరణ్ మోరీ, నయన్ మోంగియా రెగ్యులర్గా నెట్స్లో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేసేవారట. ఇక ఇటీవల కాలంలో వికెట్ కీపింగ్ చక్కగా రాణిస్తున్న వర్ధమాన్ సాహా కూడా నెట్స్లో కఠినంగా ప్రాక్టీస్ చేస్తాడట.
అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ కీపింగ్లో ధోని రికార్డు గొప్పగానే ఉంది. సయ్యద్ కిర్మాణి 88 టెస్టుల్లో 160 క్యాచ్లందుకుని, 38 స్టంపింగ్లు చేస్తే, అతడికంటే రెండు టెస్టులు ఎక్కువఆడిన మహేంద్ర సింగ్ ధోని 256 క్యాచ్లు పట్టి, 38 స్టంపింగ్లు చేశాడు.
ఇక వన్డే క్రికెట్లో ధోని 325 వికెట్లలో 240 క్యాచ్లు, 85 స్టంపింగ్లు చేశాడు. టీమిండియాకు వికెట్ కీపర్గా ధోని అరంగేట్రం చేసిన తర్వాత జట్టు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ఈ దశాబ్ధంలో బ్యాట్స్మెన్గా, వికెట్ కీపర్గా రాణిస్తున్న ఒకే ఒక్క ఆటగాడు ధోని మాత్రమే.
భారత్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన పుస్తకం 'ఐడల్స్' లో సయ్యద్ కిర్మాణిని 'కీపర్ ఆఫ్ ఇండియన్స్ ఫార్చూన్స్'గా అభివర్ణించారు. ధోనికి ఈ పదం చక్కగా సరిపోతుందని క్రికెట్ దిగ్గజాలు భావిస్తున్నారు.