'డబ్బు తీసుకొని': బీహార్ ఎన్నిక, అసహనంకు లింక్
లాస్ ఏంజిల్స్: దేశంలో ఇటీవలి వరకు జరిగిన మత అసహనం నిరసన పైన కేంద్రమంత్రి వికె సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదంతా 'చెల్లింపుల' అసహనమని దుమ్మెత్తి పోశారు. బీహార్ ఎన్నికలకు ముందు ఉద్దేశ్యపూర్వకంగా ఆ అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు.
అసహనంపై చర్చ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమన్నారు. భారీగా సొమ్ము పుచ్చుకున్న కొంతమంది అనవసరంగా లేవనెత్తిన చర్చగా ఈ అంశాన్ని ఆయన అభివర్ణించారు. భారత్లో అసహనంపై చర్చ రాజకీయ ప్రేరేపితమని, బీహార్ ఎన్నికల ముందు దానిని ఉద్దేశ్యపూర్వకంగా లేవనెత్తారన్నారు.
భారీగా సొమ్ములు తీసుకున్న కొందరు వ్యక్తులు ఈ చర్చకు కారకులు అన్నారు. బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే అసహనంపై చర్చ సద్దుమణిగిందని గుర్తు చేశారు. చర్చిల పైన దాడులు జరుగుతున్నాయని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఓట్ల కోసం రాద్దాంతం చేశారన్నారు.
70 ఏళ్లకు పైగా వయసులో ఉండి, అవినీతిపై పోరాడుతున్న అన్నా హజారేను అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని తీహార్ జైలుకు తరలించినప్పుడు ప్రస్తుత నిరసనకారులు ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశం సంఘటిత శక్తిగా మారిందని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. కాగా, ఆయన లాస్ ఏంజిల్స్లో ప్రాంతీయ ప్రవాసీ భారతీయ దివస్లో పాల్గొన్నారు.
గతంలోను బిజెపి నేతలు సిక్కులను ఊచకోత కోసినప్పుడు, తస్లీమా నస్రీన్ పైన దాడి జరిగినప్పుడు, యూపీఏ హయాంలో జరిగిన మత ఘర్షణల సమయంలో.. ఇప్పుడు అసహనం అంటున్న వారు ఏం చేశారని నిలదీశారు.