తెరాసలో ఇక టీ న్యూస్ ఎండీ కీలకం: ఎవరీ సంతోశ్ కుమార్?
ఎట్టకేలకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు ఖరారైంది. 69 మందితో ప్రకటించిన కార్యవర్గంలో తొలిసారి ‘టీ న్యూస్’ ఎండీ జోగినపల్లి సంతోశ్ కుమార్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం ఆసక్తికర పరిణామం.
హైదరాబాద్: చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆమోదించిన కమిటీ వివరాలను సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. మొత్తం 69 మందితో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఖరారు చేశారు.
ప్రస్తుతానికి ఇద్దరు మినహా మిగిలిన 67 మంది పేర్లతో జాబితాను విడుదల చేశారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీలో తెర వెనుక కీలక పాత్ర పోషించిన జోగినపల్లి సంతోశ్ కుమార్ను తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన పార్టీ కార్యవర్గంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఆసక్తికర పరిణామం.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ ఆంతరంగిక వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న జోగినపల్లి సంతోష్ కుమార్ను తొలిసారిగా రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు.
టీ న్యూస్ ఎండీగా సేవలందిస్తున్న సంతోశ్
జోగినపల్లి సంతోశ్ కుమార్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టటంలో 14 ఏళ్లకు పైగా తెర వెనుక కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. కేసీఆర్కు నమ్మినబంటుగా, విధేయుడిగా తన పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆయనకు అన్నివేళల్లో చేదోడు వాదోడుగా ఉండే సంతోష్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో పైకి కనిపించని భాగస్వామ్యాన్ని అందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. కేసీఆర్ సీఎం అయ్యాక కూడా సంతోష్ కుమార్ పార్టీ కోసం తన సేవలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. మరో గమ్మత్తేమిటంటే 'టీ' న్యూస్ ఎండీగా కూడా సంతోశ్ కుమార్ సేవలందిస్తున్నారు.
సీఎం రాజకీయ కార్యదర్శిగానే శేరి సుభాష్ రెడ్డి
ఇక 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సహాయ కార్యదర్శులతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన కార్యవర్గ కమిటీలో కీలకమైన సెక్రటరీ జనరల్ పదవి తిరిగి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కేశవరావును వరించింది. ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. అలాగే కేసీఆర్ తన రాజకీయ కార్యదర్శిగా శేరి సుభాష్ రెడ్డిని యథావిధిగా కొనసాగించారు. సుభాష్రెడ్డి టీఎస్ ఎండీసీ చైర్మన్గా ఉన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో పలువురు ఎమ్మెల్సీలు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లకు చోటు కల్పించారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించలేదు.
2014 ఎన్నికల్లో ఇలా టీఆర్ఎస్ విజయం
తెలంగాణ కోసం టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ 2009లో చేపట్టిన ఆమరణ దీక్ష తర్వాత ఉద్యమం మలుపు తీసుకొని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరోను చివరిసారిగా 2010లో ఏర్పాటు చేశారు. అదే కమిటీ దాదాపు నాలుగేళ్ల పాటు పని చేసింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను టీఆర్ఎస్ అధిష్ఠానం రద్దు చేసింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిక అసెంబ్లీ స్థానాలను నెగ్గి, కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర కమిటీ పునరుద్ధరణకు నోచుకోలేదు. అన్ని స్థాయిల్లోనూ పాత కార్యవర్గమే అనధికారికంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తోంది. సభ్యత్వ నమోదు సందర్భంగా ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ ప్రస్తుతం పార్టీ పరమైన వ్యవహారాలు పర్యవేక్షిస్తోంది. ఈ మధ్య టీఆర్ఎస్ మహిళా విభాగం, విద్యార్థి విభాగం వంటి కొన్ని పార్టీ పదవులను భర్తీ చేశారు.
12 మంది ప్రధాన కార్యదర్శులకు 10 అసెంబ్లీ స్థానాల పర్యవేక్షణ
సీఎం కేసీఆర్ తాజాగా పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీకి మోక్షం కలిగించారు. ఈ సారి రాష్ట్ర కమిటీ ఏర్పాటులో మూస పద్ధతికి భిన్నంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై టీఆర్ఎస్ పనితీరును అద్భుతంగా మెరుగుపర్చటం కోసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్షేత్ర స్థాయి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించేలా ఉండాలని ఆయన భావించారు. ఈ మేరకు కార్యవర్గంలో చోటు పొందిన 40 మందికి ఒక్కొక్కరికి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు కేటాయించారు. అలాగే 12 మంది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు ఒక్కొక్కరికి 10 వంతున అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలిపారు. అయితే ఎవరికి ఏ నియోజకవర్గాలు, ఏ బాధ్యత అప్పగించారనే విషయాన్ని తొందర్లోనే ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కమిటీ ఏర్పాటుపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు. తొలుత పార్టీ అధిష్ఠానం ముఖ్యులతో అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు తెప్పించారు. అనంతరం వాటిని వడబోయించారు. వివిధ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నారు.
పలు సంప్రదింపుల తర్వాతే కమిటీ ప్రకటన
కార్యవర్గం తయారీలో పార్టీలో తొలి నుంచి పనిచేస్తున్న వారు, కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచిత న్యాయం కల్పించేలా పార్టీ కార్యవర్గాన్ని కూర్చారు. జాబితాను ప్రకటించే ముందు వరకు కూడా సీఎం తన క్యాంపు ఆఫీసులో పలువురు సీనియర్ మంత్రులు, ముఖ్య నేతలతో సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సంప్రదింపులు జరిపారు. కమిటీలో 67 మంది పేర్లను వెల్లడించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 2 పదవులు ఏమిటి? అవి ఎవరికి దక్కుతాయి? అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా ప్రకటించిన జాబితాలో ఉపాధ్యక్షులు, కోశాధికారి లేరు. పెండింగ్లో పెట్టిన రెండు పేర్లు ఆ రెండు పదవులకేనా? లేక మరేదైనా పదవులకు సంబంధించినవా? అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.