మోడీ బాటలోనే యోగి: ఇఫ్తార్ విందు సాంప్రదాయానికి 'నో'!..
బీజేపీ అగ్రనేతలు వాజ్ పేయి, రాజ్ నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్ వంటి వారు సైతం గతంలో ఇఫ్తార్ విందులు ఇచ్చారు. కానీ సీఎం యోగి మాత్రం ఈ సాంపద్రాయాన్ని కొనసాగించే అవకాశం లేదని చెబుతున్నారు.
లక్నో: హిందుత్వ వాదిగా ముద్రపడ్డ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇఫ్తార్ విందు సాంప్రదాయాన్ని పాటించకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ ఏటా ముఖ్యమంత్రుల అధికారిక నివాసంలో ముస్లింల సోదరులకు ఈ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ.
బీజేపీ అగ్రనేతలు వాజ్ పేయి, రాజ్ నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్ వంటి వారు సైతం గతంలో ఇఫ్తార్ విందులు ఇచ్చారు. కానీ సీఎం యోగి మాత్రం ఈ సాంపద్రాయాన్ని కొనసాగించే అవకాశం లేదని చెబుతున్నారు. గతంలో రామ్ ప్రకాష్ గుప్తా సీఎంగా ఉన్న సమయంలోను అధికారికంగా ఇఫ్తార్ విందు ఇవ్వలేదు. ఈ లెక్కన ఇఫ్తార్ విందు ఇవ్వని బీజేపీ సీఎంల జాబితాలో యోగి ఆదిత్యనాథ్ రెండో వ్యక్తిగా చేరుతారు.
ఇదిలా ఉంటే, దేశ ప్రధాని మోడీ సైతం ఇప్పటివరకు ఇఫ్తార్ విందులేవి ఇవ్వలేదు. దీన్నిబట్టి మోడీ బాటలోనే యోగి కూడా నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే హిందువులకు సంబంధించిన చైత్ర నవరాత్రి సందర్బంగా.. బీజేపీ నేతలకు ఫలహార విందు ఇచ్చిన సీఎం యోగి.. ముస్లింల ఇఫ్తార్ విందును మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ముస్లిం పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో లౌకిక స్పూర్తిని నిలిపేందుకు గతంలో బీజేపీ సీఎంలంతా ఇఫ్తార్ విందు ఇచ్చారని, సున్నీ ముస్లిం మత పెద్ద, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు రసీద్ ఫిరంగీ మహాలీ తెలిపారు. ఇకపోతే సీఎంతో సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్ మాత్రం ఇఫ్తార్ విందులు ఇచ్చి తీరుతుందని ఆ సంస్థ ముస్లిం విభాగం రాష్ట్రీయ ముస్లిం మంచ్ తెలిపింది.