గుంటూరు వాసి కోసం ఉత్తరాఖండ్ ప్రజల పోరాటం
అమరావతి: నిజాయితీ కలిగిన అధికారుల పక్షాన ప్రజలు ఎప్పటికీ నిలుస్తారనడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ, తమ కోసం ఎంతగానో కష్టపడుతున్న ఓ కలెక్టర్ కోసం ఉత్తరాఖండ్ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.
అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ కలెక్టర్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం. ఆయన పేరు శ్రీధర్ బాబు. వయసు 33. ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ఎంపికైన ఆయన ఉత్తరాఖండ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా కలెక్టరుగా పనిచేసిన ఆయన తన నిజాయితీతో స్థానిక ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.

అయితే ఆయన్ని మే 28న ఆకస్మాత్తుగా బదిలీ చేసి వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శిగా నియమించారు. ఇంకేముంది విషయం తెలుసుకున్న ఉత్తరకాశీ జిల్లా ప్రజలు ఆయన కోసం ఆందోళన చేపట్టారు. ''మా కలెక్టర్ మాకు కావాలి. ఆయన బదిలీని రద్దు చేయండి'' అంటూ ఉత్తరాఖాండ్ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు.
శ్రీధర్ బాబు అంటే ఎందుకంత అభిమానం
సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2012లో ఉత్తరాఖండ్ను భారీ వరదలు కుదిపేశాయి. ఈ వరదల్లో కేథార్నాథ్ యాత్రకు వెళ్లిన ఎంతోమంది ప్రజలు ఆకస్మిక వరదల్లో చిక్కుకున్నారు. ఈ భారీ వరదల్లో సుమారు 5600 మంది మృతిచెందినట్లు అధికారులు లెక్కలు కూడా వేశారు.

అప్పట్లో సంభవించిన వరదల కారణంగా ఉత్తరకాశీ జిల్లాలోని రోడ్లు దారుణంగా దెబ్బతినడమే కాక పలు వంతెనలు కూలిపోయాయి. వాటిని పునరుద్ధరించే క్రమంలో ఎక్కడా అవినీతి, అవకతవకలు జరగకుండా శ్రీధర్ బాబు సాధ్యమైనంత వరకు నిరోధించగలిగారు. దీంతో పాటు జిల్లాలో ఎక్కడ అవినీతి జరిగినా తనదైన శైలిలో అడ్డుపడ్డారు.
దీంతో రాజకీయ నాయకులు ఆయన్ను ఎలాగైనా సరే తమకు అడ్డురాకుండా తప్పించాలనే ఉద్దేశ్యంతో అక్కడ నుంచి బదిలీ చేశారు. అవినీతిని అడ్డుకుంటున్నారు కాబట్టే ఆయన్ని బదిలీ చేశారని అక్కడి ప్రజలు సైతం నమ్ముతున్నారు.
ఈ క్రమంలో మా కలెక్టర్ మాకు కావాలంటూ పెద్ద ఎత్తున యువత, మహిళలు రోడ్లపైకి వచ్చి శ్రీధర్ బాబుకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఈ ఆందోళన కోసం యువత పెద్ద ఎత్తున సోషల్ మీడియాను వినియోగించుకుంటుంది. ఆందోళనకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ యువత శ్రీధర్కు మద్దతుగా నిలిచింది.












Click it and Unblock the Notifications