జగన్-పవన్.. 'హోదా' కోసం ఒక్కటవలేరా?
విజయవాడ : ప్రజా పోరాటాలు పార్టీలకు అతీతంగా సాగినప్పుడే.. రాజకీయాల ద్వారా ఓ సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చే వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా.. ఒకే సామాజిక ప్రయోజనంపై తలో దారి అన్నట్టుగా.. ఎవరి పోరాట పంథాను వారు అనుసరిస్తే.. అది రాజకీయమూ అయ్యే ప్రమాదం లేకపోలేదు.
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే.. అధికార పక్షం తెరుమరుగు చేసిన ప్రత్యేక హోదా నినాదాన్ని బలంగా వినిపించడానికి వైసీపీ అధినేత జగన్ తో పాటు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరి పోరాటం ఒక్కటే. అలాంటప్పుడు.. ఇద్దరూ ఒక్క తాటిపైకి వచ్చి పోరాటం చేస్తే.. కేంద్రంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేయవచ్చు కదా! అన్న అభిప్రాయం సగటు వ్యక్తిలో ఉండవచ్చు.

అయితే ఇదంతా సాధ్యమయ్యే పనేనా? అవును కంటే.. కాదు అన్న సమాధానమే 99శాతం వినిపిస్తుంది. సైద్దాంతికంగా పవన్-జగన్ మధ్య చాలా వ్యత్యాసం ఉండడం ఇందుకు ఓ కారణమైతే.. ప్రతిపక్షానికి దక్కాల్సిన పోరాట క్రెడిట్ ను పవన్ లాగేసుకోవడం కూడా జగన్ కు రుచించకపోవచ్చు. కాబట్టి.. ప్రత్యేక హోదాపై ఈ ఇద్దరు కలిసి పోరాటం చేస్తే బాగుండు అనుకోవడమే తప్పించి.. అది ఆచరణ రూపం దాల్చడం అనితర సాధ్యం.
జగన్-పవన్ ను ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రకటించడంతో ఈ చర్చ ప్రస్తుతం ఏపీ పొలిటికల్ తెరపై ప్రాధాన్యతను సంతరించుకుంది. వామపక్షాలతో కలిసి పోరాటం చేసేందుకు ఇరువురు కార్యాచరణ సిద్దం చేసుకోవాలని రామకృష్ణ సూచించారు. హోదాపై ఐక్య పోరాటానికి ఈ ఇద్దరిని ఒప్పించడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు. మరి.. ఆయన మాటలు కార్యరూపం దాలుస్తాయా! లేక అందరూ అనుకున్నట్టే కేవలం ఊహలకే పరిమితమవుతాయా? అన్నది రానున్న రోజుల్లో తేట తెల్లం కానుంది.












Click it and Unblock the Notifications