రా రమ్మంటున్నారు: పవన్ కల్యాణ్కు లెక్కుందా?
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వదని తేల్చేసిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఒత్తిడి పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై కొంత కాలం ఆగి చూద్దామని ఆయన గతంలో ఓసారి అన్నారు. దానికితోడు భూసమీకరణకు ఇష్టపడని రైతులు అండగా నిలవా లంటూ ప్లకార్డులతో పవన్ కల్యాణ్ను ఆహ్వానిస్తున్నారు.
ఈ పరిస్థితిలో పవన్ కల్యాణ్ ఏం చేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు వస్తారా అనేది తేలడం లేదు. సినిమాల్లో నటిస్తూ 2019 ఎన్నికల వరకు వేచి చూస్తారా అనేది కూడా ఓ ప్రశ్నగానే ఉంది.
సరిగ్గా 2019 ఎన్నికల ముందు సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వస్తే ప్రజలు పవన్ కల్యాణ్ను నమ్ముతారా అనేది కూడా ఓ ప్రశ్నగానే ఉంది. 2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఓట్లను చీల్చడం ఇష్టం లేక తన పార్టీని పోటీకి దింపడం లేదని ఆయన అప్పట్లో చెప్పారు.
"కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో'' అంటూ పిలుపు నిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం గురించి కూడా ఆయన చెబుతూ వచ్చారు.. ఎన్నికల అనంతరం రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నిరుు పవన్ ఆయన పర్యటించారు.
రైతులు ఇష్టపూర్వకంగా ఇస్తే భూములు తీసుకోండిగానీ, బలవంతంగా లాక్కుంటే సహించేది లేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 10తో తీరింది. మరో ఐదువేల ఎకరాల భూసమీకరణ చేయాల్సి ఉండగా పలు ప్రాంతాల్లోని రైతులు ఇందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పెనుమాక, ఉండవల్లి, నౌలూరు, ఎర్రబాలెం రైతులు భూసమీకరణను వ్యతిరేకిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రైతులు పవన్ కల్యాణ్ ఫ్లైక్సీలు చేతబూని పవన్ రాకను ఆకాంక్షిస్తున్నారు. భూసమీకరణ జరగకుండా అండగా ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వం భూసేకరణకు సిద్ధపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో పవన్ కల్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటానికి ముందుకు వస్తారా, లేదా అనేది కూడా తేలాల్సిన విషయమే.
రాష్ట్రానికి హోదా వస్తుందనే ఆశ ఇంకా ఉందని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. కానీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన హోదాకు అవకాశం లేదనే విషయాన్ని చాలా స్పష్టంగానే తెలియజేసింది. ఈ స్థితిలో పవన్ కల్యాణ్ హోదా కోసం, భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి ముందుకు వస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే.