వైయస్ జగన్ పార్టీ: తెలంగాణలో పూర్తిగా ఖాళీ
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో దాదాపుగా ఖాళీ అయింది. పార్టీ అధికార ప్రతినిధి, ఖమ్మం జిల్లాకు చెందిన గట్టురామచంద్రరావు, మరి కొంత మంది మాత్రమే మిగిలారు. వైయస్సార్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. దాంతో తెలంగాణలోని రెండు మూడు జిల్లాలు మినహాయించి, మిగతా జిల్లాల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్లే.
కొండా సురేఖ, బాజిరెడ్డితో పాటు మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి వంటి పలువురు నేతలు గతంలోనే పార్టీని వీడారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తారని ఇంతకాలం చాలామంది ఆశించారు. వైయస్ షర్మిలకు తెలంగాణ ప్రచార బాధ్యతలు అప్పగిస్తారనుకున్నారు. కాని అందరి అంచనాలు తలకిందులయ్యాయి. జగన్, షర్మిల, విజయమ్మ మొక్కుబడిగా మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి ప్రచారం చేశామనిపించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాస్తా బలం ఉంది. ఇక్కడ ఎంపి సీటుకు పార్టీ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో ముందంజలోనే ఉన్నారు.
ఇక సీమాంధ్రపైనే మొత్తం దృష్టిని కేంద్రీకరించి అధికారంలోకి వచ్చే దిశగా జగన్ పావులు కదుపుతున్నారు. జగన్తో పాటు షర్మిల, విజయమ్మ జనంలోకి వెళ్లి జనభేరి పేరిట ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. తన ప్రసంగాల్లో జగన్ ఇంతవరకు ఖజానా ఖాళీ చేసే అంశాలనే ప్రస్తావిస్తున్నారు. దాదాపు 20 వేల కోట్ల రూపాయల లోటుబడ్జెట్తో ఉండే కొత్త రాష్ట్రానికి అభివృద్ధి అవసరం.
తనకు అధికారం ఇస్తే తొలి పది సంతకాలు చేసి సంక్షేమ ఫలితాలను జనానికి అందిస్తానని చెప్పిందే చెప్పడం మినహాయించి, అభివృద్ధి కోణం మచ్చుకైనా కనపడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీలో ఉండేవాళ్లు ఉంటారు, వెళ్లే వాళ్లు వెళ్లవచ్చు అనే నిశ్చితాభిప్రాయంతో జగన్ ముందుకెళుతున్నారని, ఈ రోజుల్లో ఈ తరహా నాయకత్వ ధోరణి వల్ల ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువంటున్నారు.
కోస్తా, రాయలసీమ జిల్లాల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీలతో పోల్చితే ప్రచారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. టిడిపి అధినేత చంద్రబాబు మాదిరిగా హైదరాబాద్లో ఉండి సమయాన్ని వృధా చేయకుండా జనంలోకి జగన్, షర్మిల, విజయమ్మ దూసుకెళుతున్నారు. అయితే, సమన్వయ లోపం, రాజకీయ అస్పష్టత, ఎన్నికల అనంతరం అనుసరించే విధి విధానాలు, విభజన తర్వాత రాష్ట్భ్రావృద్ధి అనే అంశాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి స్పష్టమైన అజెండా లేదు. దీంతో సీమాంధ్రలో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏ మేరకు నెట్టుకొస్తుందనేది ఇప్పుడు చెప్పడం కష్టమే.