భూమా సహా 8మందిని మళ్లీ ఇరుకున పెట్టిన జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి... తెలుగుదేశం పార్టీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మళ్లీ టార్గెట్ చేశారు! 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కొద్ది రోజుల క్రితం టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
వారిని లక్ష్యంగా చేసుకొని.. జగన్ రెండుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తెచ్చారు. కానీ అతని లక్ష్యం నెరవేరలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతివ్యూహంతో వెళ్లడంతో జగన్ అవిశ్వాస తీర్మానం ఫలప్రదం కాలేదు. టిడిపిలో చేరిన 8మంది ఎమ్మెల్యేలపై వేటు వేయించే ఉద్దేశ్యంలో భాగంగా జగన్ అవిశ్వాస అస్త్రాన్ని ఉపయోగించారు.
ద్రవ్యవినిమయ బిల్లు ఓటింగులో పాల్గొనే అంశాన్ని కూడా జగన్.. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలే లక్ష్యంగా పావులు కదిపారు. ఇందులో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లు ఓటింగులో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని వైసిపి విప్ జారీ చేసింది.
వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేశారు. భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, భూమా అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి తదితర ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. అందరు కూడా ద్రవ్య వినిమయ బిల్లు ఓటింగులో పాల్గొనాలని విప్లో పేర్కొన్నారు.
అవిశ్వాసం ద్వారా తన లక్ష్యం నెరవేరకపోయినప్పటికీ.. ద్రవ్య వినిమయ బిల్లును వినియోగించుకోవాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే బిల్లుపై ఓటింగ్ను జరిపించాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇచ్చిన ప్రతిపక్షం, తన ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది.
వారం రోజుల క్రితమే విప్ సమాచారాన్ని ఎమ్మెల్యేలకు పంపిన వైసిపి, మరోసారి వారికి పార్టీ నిర్ణయాన్ని గుర్తు చేసింది. ఓటింగులో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి విధిగా హాజరు కావాలని, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేకుంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది. మరోవైపు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు.