ఆగస్టు 5-మోదీ మార్క్ డెసిషన్స్ డే : ఈ రోజే ఆ నిర్ణయాల వెనుక-పాక్ కు క్లియర్ వార్నింగ్..!!
ఈ రోజు ఆగస్టు 5. దేశంలో కీలక అంశాలు-ప్రధాని మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు ఈ రోజే సాక్ష్యం. వరుసగా రెండేళ్ల పాటు ప్రధాని రెండు కీలక నిర్ణయాలను ఇదే ఆగస్టు 5న తీసుకున్నారు. సుదీర్ఘ కాలం దేశంలో పరిష్కారం కాని సమస్యలుగా ఉన్న రెండు కీలక అంశాలకు ముగింపు ఇచ్చారు. బీజేపీ స్థాపింపిచన సమయం నుండి దేశంలో అమలు చేయాల్సిన అంశాలుగా నిర్ణయించిన వాటిలో కీలకమైన ఆ రెండు అంశాలను మోదీ ఇదే రోజున పరిష్కారం చూపించారు.
ఆగస్టు 5..సంథింగ్ స్పెషల్ డే..
అందులో ఒకటి.. ఆర్టికల్ 370 రద్దు. 2019 ఆగస్టు 5న పార్లమెంట్ లో ఎవరూ ఊహించని విధంగా ఈ బిల్లును తీసుకొచ్చి..అంతే అనూహ్యంగా ఆమోదించేలా బీజేపీ నాయకత్వం పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించింది. ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం ఆ వెంటనే రాష్ట్రపతి అంగీకారం-గజెట్ జారీ పూర్తయినాయి. అదే విధంగా.. 2020 ఆగస్టు 5న చరిత్ర లో ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యగా మారిన సున్నితమైన అంశం అయోధ్య రామమందిర నిర్మాణం. అప్పటికే సుప్రీం కోర్టు రామ మందిరం విషయంలో తీర్పు ఇవ్వటంతో..గత ఏడాది ఇదే రోజున ప్రధాని మోదీ అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసారు.
ఆగస్టు 5 నే పాకిస్థాన్ కుట్ర పూరితంగా...
ఇక, ఆర్టికల్ 370 ని తొలగించడం ద్వారా కశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చే నిబంధనను రద్దు చేసిన భారత ప్రభుత్వం దీని ద్వారా కాశ్మీర్ పైన కన్నేసిన దాయాది దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆగస్టు 5న ఈ చట్టం తీసుకురావటం వెనుక మరో ముఖ్య కారణం ఉంది. కాశ్మీర్ ను సొంతం చేసుకోవాలనే దురాలోచనతో పాకిస్థాన్ 1965 లో సరిగ్గా ఇదే రోజున జిబ్రాల్టర్ ఆపరేషన్కు దిగింది. అదే యుద్దంగా మారింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన దాదాపు 6 వేల మంది సైనికులు చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కశ్మీర్ను ఎలాగైనా ఆక్రమించుకోవాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
యుద్దానికి దారి తీసిన దురాక్రమణ యత్నం..
చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమి, నెహ్రూ మరణంతో కుంగిపోయి ఉన్న భారతదేశాన్ని మరింత దెబ్బకొట్టేందుకు పొరుగున ఉన్న పాకిస్తాన్ కుట్ర పన్నింది. వేలాది మంది పాకిస్తానీ యోధులు గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందారు. అదను చూసి ఆగస్టు 5 ఆయుధాలతో కశ్మీర్లోకి ప్రవేశించారు. వారు కశ్మీర్లోని ముస్లింలను భారతదేశానికి వ్యతిరేకంగా ప్రేరేపించడం, తమ ప్రణాళిక విఫలం అవుతుండటాన్ని గమనించిన పాకిస్తాన్.. ఫిరంగులతో కాల్పులు జరుపడం ప్రారంభించింది. ఇది భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధానికి దారితీసింది.
ఆ సమయంలో నే 540 కిలో మీటర్ల ఆక్రమణ..
సెప్టెంబర్ 22 న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించడంతో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో భారతదేశం 1920 కిలోమీటర్లు, పాకిస్తాన్ 540 కిలోమీటర్ల భూమిని ఆక్రమించాయని అంచనా వేశారు. అలాగే, 2,735 మంది భారత సైనికులు, 5,988 మంది పాకిస్తాన్ సైనికులు ఈ యుద్ధంలో చనిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో..ఎలాగైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్ దే అంటూ..అదే విధంగా కాశ్మీర్ సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ఇవ్వటంలో కీలక అడుగుగా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నారు.
అందుకు సమాధానమే..ఆగస్టు 5నే కాశ్మీర్ విషయంలో..
దీని పైన పాక్ నేతలు అనేక వ్యాఖ్యలు చేసారు, కానీ, ఇది భారత్ అంతర్గత వ్యవహారమంటూ భారత్ ప్రతినిధులు తిప్పి కొట్టారు. దీని ద్వారా కాశ్మీర్ భారత్ లో ఇతర రాష్ట్రాల మాదిరే ఒక రాష్ట్రంగా మారబోతోంది. ఆ సమయంలో కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించినా.. ఇప్పుడు అక్కడ పూర్తి శాంతియుత వాతావరణ నెలకొనటంతో రాష్ట్రంగా మార్చే ప్రక్రియ అమలు చేస్తున్నారు. పార్లమెంటులో జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు, దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
జనసంఘ్ సుదీర్ఘ కల..ఫలించిన వేళ..
దీంతో జన్సంఘ్ దీర్ఘకాల డిమాండ్ అయిన జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం నెరవేరినట్లయింది.ఆర్టికల్ 370 రద్దు చేసి రెండేండ్లు గడిచింది. ఈ రెండేండ్లలో కశ్మీర్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొవిడ్ ఉన్నప్పటికీ పర్యాటకులు వస్తూనే ఉన్నారు. దాల్ సరస్సులో చాలా మంది పర్యాటకులు బోటు షికారు చేస్తున్నారు. పర్యాటకులు 20 నుంచి 25 శాతం వరకు తిరిగి రావడంతో కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్నది. ఫలితంగా ఇక్కడి 20 శాతం మందికి ఉపాధి అందివచ్చింది.
వందేళ్లకు పైగా నిరీక్షణ..రామాలయం
ఇక, గత ఏడాది ఇదే రోజున ప్రధాని మోదీ ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమిపూజ చేసారు. 2025 నాటికి అక్కడ భక్తులకు దర్శనం కలిగించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందు కోసం ఇప్పటికే రాయాలమ కమిటీ ఏర్పాటు చేసారు. కోట్లాది మంది మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్మాణం జరగనుంది. దేశ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. ఇలా..ఆగస్టు 5 రోజున మోదీ తన మార్క నిర్ణయాలు అమలు చేసారు. ఇవి దేశ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు.
అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల లోగా ప్రధాని తొలి నుంచి జనసంఘ్ సమయం నుంచి అలోచనలకే పరిమితమై..అమలుకు నోచుకోని ఇతర అంశాల పైన ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి పూర్తి మెజార్టీ.. పదేళ్ల పాలన పూర్తి కానుండటం..మోదీ మార్క్ నిలిచిపోవాలనే తపన ఆ దిశగా రానున్న రోజుల్లో సంచలన నిర్ణయాల దిశగా నడిచే అవకాశం కనిపిస్తోంది.