రెవెన్యూ శాఖపై సీఎం అంత సీరియస్సా?.. ఉద్యోగులు సమ్మె చేసేంత కీలక నిర్ణయమా?
హైదరాబాద్ : తెలంగాణలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన కాబోతుందా? ఆ శాఖ ఉద్యోగుల తీరు మారడం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా? జూన్ లో వర్షాలు పడే సమయానికి.. రాష్ట్రమంతటా సెగ పుట్టించేలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా కేసీఆర్ మాట్లాడిన తీరు సమాధానంగా కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన యువరైతు శరత్ భూమి సమస్య పరిష్కరించడంలో భాగంగా మనసులోని మాట బయటపెట్టారు కేసీఆర్.

అవినీతి పెరిగింది.. వీఆర్వోలే అంత..!
రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయింది. వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది వానిది వీనికి రాస్తరు.. వీనిది వానికి రాస్తరు.. సాయంత్రం కాగానే జేబులు నింపుకుని ఇంటికి పోతరు. ఈ మాటలు సాక్షాత్తు సీఎం కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాటలు. మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే యువరైతు భూమి సమస్య పరిష్కారంలో భాగంగా.. అతడితో ఫోన్లో సంభాషించిన కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగుల లీలలపై ఈవిధంగా స్పందించారు.
రెవెన్యూ శాఖలో అవినీతి తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. జూన్ లో తమ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించబోతోందని తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయంతో సమ్మె జరగొచ్చు..!
రానున్న మూడు నెలల్లో ఏం జరగబోతోందనేది అందరూ చూస్తారు. వ్యవస్థ మార్చేందుకు ప్రయత్నం జేస్తున్న. ఎవరేమన్నా, అడ్డుపడినా ఆగే ప్రసక్తి లేదు. నేను అనుకున్నది జేస్తా. జూన్ తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయంతో.. రెవెన్యూ ఉద్యోగులు సమ్మె జేస్తరు. ఆ సమయంలో ప్రజలంతా ప్రభుత్వం వైపు నిలబడాలంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం చర్చానీయాంశమైంది.
రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలనేది తమ ఎజెండాగా చెప్పుకొచ్చారు కేసీఆర్. రైతులు, భూములకు సంబంధించిన కొన్ని పనులు రెవెన్యూ వాళ్లే చేయాలనేది మన బలహీనత.. అయితే అట్ల లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్షమన్నారు. ఎన్నికలన్నీ ఎక్కడికక్కడ అయిపోయాక జూన్ తర్వాత ధరణి వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొద్దామనే ప్లాన్ లో ఉన్నట్లు చెప్పారు. అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. ఇక రైతులు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాల్సిన పని ఉండదన్నారు. ఎవరి రికార్డు వారికే ఉంటుందని.. భూ వివాదాలకు సంబంధించిన తలనొప్పులు పోతాయన్నారు.

ఎవ్వరాపినా ఆగను..!
భూ వివాదాలు లేకుండా వ్యవస్థ సాఫీగా నడిచేలా చేసేందుకు కొద్ది రోజులు అమ్మకాలు, కొనుగోళ్లు ఆపుదామనుకున్నామని.. అయితే రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆగిపోతుందనే కారణంతో వెనుకడుగు వేసినట్లు చెప్పారు. తాను తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని.. జూన్ తర్వాత పనిచేయని సర్పంచులు చాలామంది ఎగిరిపోతారని వ్యాఖ్యానించారు. అదే కోవలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే కార్యక్రమం ఉండబోతుందన్నట్లుగా చెప్పుకొచ్చారు. మొత్తానికి జూన్ నెలలో వ్యవస్థను మార్చుతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications