APSRTC: ఉచిత బస్సుల్లో ఐడీ కార్డుకు చెక్ ? ఉద్యోగుల కీలక డిమాండ్లు..!
ఏపీలో కూటమి సర్కార్ మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ (APSRTC) పై , ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే కొత్త బస్సులు కొనకపోవడం, కొత్త ఉద్యోగ నియామకాలు చేయకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు కూడా యథావిథిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వం ముందు ఇవాళ మరోసారి కీలక డిమాండ్లు ఉంచింది.
స్త్రీశక్తి పథకం అమలులో సిబ్బంది ఇబ్బందులు తొలగించాలని ఆర్టీసీ ఈయూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మహిళా ప్రయాణికులకు గుర్తింపుకార్డు లేకుండానే టికెట్లు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఆర్టీసీ సిబ్బందిపై దాడులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరింది. వీటితో పాటు ఆర్టీసీలో 3,000 కొత్త బస్సులు, 10,000 ఖాళీల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తోంది.

ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్కు కాకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. గ్రేడ్-II మెకానిక్లకు న్యాయం చేసి లీడింగ్ స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కొత్త జిల్లాల్లో డిస్పెన్సరీలు, విశాఖలో 25 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఈ మేరకు విజయవాడలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన ఈయూ నాయకులు తమ డిమాండ్లను అందజేశారు. వీటిపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications