సాయిరెడ్డి కొత్త పార్టీ, తెర వెనుక - అసలు టార్గెట్..!!
వైసీపీ మాజీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి కీలక ప్రకటన చేసారు. రాజకీయాల్లో రీ ఎంట్రీ పైన స్పష్టత ఇచ్చారు. కొత్త మీడియా సంస్థలతో పాటుగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ లో నెలకొన్న రాజకీయాల్లో సాయిరెడ్డి నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. చంద్రబాబు లక్ష్యంగా సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పైనా విమర్శలు చేసారు. అయితే, సాయిరెడ్డి కొత్త పార్టీ నిర్ణయం వెనుక ఏం జరుగుతోంది.. అసలు టార్గెట్ ఎవరనేది చర్చగా మారుతోంది. కాగా.. సాయి రెడ్డి వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. తాజాగా సాయి రెడ్డి నివాసంలో మద్యం కుంభకోణం కేసు విచారణలో బాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాలు, తన పొలిటికల్ రీ ఎంట్రీపై సాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తన నివాసంలో జరిగిన సోదాల్లో ఈడీ అధికారులకు ఏమీ లభించలేదని, అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరించానని విజయ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. జులై నెలలో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ముఖ్యంగా ఏపీ రాజకీయల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అదే విధంగా రాజకీయాలతో పాటు త్వరలోనే తాను మీడియా రంగంలోకి కూడా అడుగు పెడుతున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

సాయిరెడ్డి అసలు టార్గెట్
రాజకీయాల్లోకి వచ్చాక చంద్రబాబు అవినీతి భాగోతాన్ని ఎండగడుతానని, దుష్ట రాజకీయాల అంతు చూస్తానంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఇదే సమయంలో వైసీపీ తీరుపైనా విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు సరైన బుధ్ది చెప్పారని, ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి బుద్ధి తెచ్చుకోవాలని విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు. దీంతో విజయసాయిరెడ్డి కొత్త పార్టీతో రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీకి ఎక్కువ నష్టం చేస్తుందనే అంశాలపై అంచనాలు మొదలయ్యాయి. కేంద్రంలో బీజేపీ తో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా సాయిరెడ్డి.. ఇప్పుడు రాజకీయ నిర్ణయాలను వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. సాయిరెడ్డి ఇదే అంశం పైన తన సన్నిహితులతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. సాయిరెడ్డికి ఉన్న ఆర్థిక బలం, ఢిల్లీ పరిచయాలు అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. జగన్ కోటరీ పైనే విమర్శలు చేసిన సాయిరెడ్డి.. జగన్ పైన ఎలాంటి విమర్శలు చేయటం లేదు. దీంతో.. ఏపీలో పార్టీలు.. సామాజిక వర్గాల వారీగా ఓటింగ్ జరిగే పరిస్థితుల్లో సాయిరెడ్డి టార్గెట్ ఎవరు.. ఏం చేయబోతున్నారనేది రాకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications