ఉదయం 8.30నుండి సాయంత్రం 5గంటల వరకు బయటకు రావద్దన్న మంత్రి పొంగులేటి
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో 44డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరం కాకుంటే ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రజలకు సలహా ఇచ్చారు.
44 డిగ్రీలు దాటి రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, వడగాల్పులు వీచే సూచనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా వేడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రజలను అలెర్ట్ చేసిన మంత్రి పొంగులేటి
ఇప్పటికే అనేక ప్రాంతాలలో ప్రజలు ఎండలకు వెళ్లి వడదెబ్బ బారిన పడుతున్నారు. కొందరు వడదెబ్బతో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు . అత్యవసరం అయితే తప్ప ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటి నుండి బయటకు రావద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
అన్ని జిల్లాల కలెక్టర్లకు మంత్రి ఆదేశం
కొన్ని జిల్లాలలో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రజలను వడదెబ్బ బారిన పడకుండా అలర్ట్ చేయాలన్నారు. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తాగునీటికి ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు
వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ORS ప్యాకెట్లు మరియు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications