పశ్చిమ బెంగాల్ లో దీదీ ఓటమికి కారణాలివే!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నిన్నటివరకు అజేయశక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోటలు బీటలు వారాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఊహించని దెబ్బ మమతా బెనర్జీ పార్టీకి తగిలింది. దాదాపు మమతా బెనర్జీ 15ఏళ్ల పాలన ముగిసే అవకాశం ఉందని తాజా ఫలితాలతో స్పష్టంగా తెలుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి గల కారణాలు ఏమిటి? టీఎంసి పతనానికి ఏ పరిస్థితులు దారితీశాయి అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన
పశ్చిమ బెంగాల్లో మహిళా భద్రత, అవినీతి, పటిష్ట ప్రతిపక్ష వ్యూహాలు టీఎంసీ పతనానికి దారితీశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ జి కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం కాగా మహిళల భద్రత పైన రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగాయి. ఈ సంఘటన ప్రభావం టి.ఎం.సి ఓట్ల పైన తీవ్ర ప్రభావం చూపించింది.

అవినీతి ఆరోపణలు, ఉద్యోగాలలో అక్రమాలు
అంతేకాదు మహిళా ఓటర్లే బలం అనుకున్న మమతా బెనర్జీకి ఈసారి అదే వర్గం వ్యతిరేకతను చూపించింది. 2012లో పార్క్ స్ట్రీట్ ఘటన వ్యాఖ్యలు కూడా మమతా బెనర్జీ పార్టీ కోలుకోలేని దెబ్బ తగలడానికి కారణమయ్యాయి. టీఎంసి పరిపాలనలో భారీ అవినీతి ఆరోపణలు, టీచర్ల నియామకాలలో జరిగిన అక్రమాలు సుప్రీంకోర్టుకు చేరడం వంటి అనేక ఘటనలు మమత పార్టీకి శరాఘాతం అయ్యాయి.
బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసల వ్యవహారంతో నష్టం
మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అనుచరుల ఇళ్లలో కోట్లాది నగదు లభించడం, వీడియోలు వైరల్ కావటం, శారద, నారద వంటి పాత కుంభకోణాలు టీఎంసీకి తీరని నష్టం కలిగించాయి. టీఎంసీ నేతలు అవినీతిపరులు, వీడియోలే రుజువు అని ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేశాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు టీఎంసి కి నష్టం చేశాయి.
15 ఏళ్ళ పాలనపై ప్రజల్లో వ్యతిరేఖత
అక్రమంగా వచ్చినవారు ఓటు హక్కు పొంది, స్థానిక జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని విపక్షాలు వాదించాయి. దీనిపై ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పరిశీలనలో సుమారు 89 లక్షల మంది పేర్లను తొలగించింది. టీఎంసీ మద్దతుదారులైన వీరు ఓటు వేయలేకపోవడం పరాజయానికి ఒక కారణమైంది.పదిహేనేళ్ల పాలనపై ప్రజల్లో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది.
దీదీ ప్రభుత్వ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో బీజేపీ సక్సెస్
మమతా బెనర్జీ పాలన తీరుపైన ప్రజలు ఈసారి కాస్త విముఖతను చూపించారు. నిరుద్యోగం, స్థానిక నాయకుల దౌర్జన్యాలు, అభివృద్ధికి ఆటంకమైన కేంద్ర-రాష్ట్ర నిధుల పోరు వంటివి ఓటర్లలో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. ఇది బీజేపీకి అనుకూలంగా మారింది. మమతా బెనర్జీ పాలనలో జరిగిన తప్పులను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి బిజెపి లబ్ధి పొందింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్లో దీదీ పాలన ముగియనుంది అన్నది తాజా ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.













Click it and Unblock the Notifications