తుఫాను హెచ్చరిక: ఆ రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం!
భారత ఉపఖండంలో వాతావరణం అనూహ్య మలుపులు తీసుకుంటోంది. ఒకవైపు ఈశాన్య, తూర్పు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తుంటే, మరోవైపు పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న జల్లులు భానుడి భగభగల నుండి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.
ఈశాన్య భారతదేశం, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈ వారం ప్రకృతి ప్రకోపం తీవ్రంగా ఉండబోతోందని ఐఎండీ అంచనా వేసింది. రానున్న రెండు రోజుల్లో అస్సాం, మేఘాలయ, సిక్కిం, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్లలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో పాటు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

తూర్పు భారతంలో కదులుతున్న తుఫాను వ్యవస్థలు..
ప్రస్తుతం తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వాతావరణ వ్యవస్థ కేంద్రీకృతమైంది. తూర్పు ఉత్తరప్రదేశ్లోని ఈ వ్యవస్థ క్రమంగా బీహార్ వైపు కదులుతుండగా, జార్ఖండ్లో మొదలైన ఉరుములు.. గంగా పశ్చిమ బెంగాల్ (GWB) వైపు పురోగమిస్తున్నట్లు ఐఎండీ పేర్కొంది. దీనివల్ రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
సిమ్లాలో పర్యాటకుల సందడి.. హిమాచల్కు 'ఆరెంజ్ అలర్ట్'
మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40-45°C దాటి నిప్పులు చెరుగుతుండగా, మంగళవారం సిమ్లాలో కురిసిన తాజా వర్షం పర్యాటకులకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ ఆకస్మిక మార్పుతో పంజాబ్, హర్యానా, దక్షిణ భారత్ నుండి పర్యాటకులు సిమ్లాకు పోటెత్తారు. అయితే, రాబోయే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది.
ప్రజలకు సూచనలు: జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..
- తుఫాను, బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఇళ్లలోనే ఉండాలి.
- మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాలకు, చెట్ల కిందకు వెళ్లకూడదు.
- ప్రయాణాలు చేసేటప్పుడు వాతావరణ అప్డేట్లను గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలి.
అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications